కందుకూరు, గుంటూరు తొక్కిసలాటలపై ఏపీ సర్కార్ సీరియస్.. రిటైర్డ్ హైకోర్ట్ జడ్జి నేతృత్వంలో విచారణ కమిటీ
కందుకూరు, గుంటూరులలో జరిగిన తొక్కిసలాట ఘటనలపై విచారణకు రిటైర్డ్ హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ శేషనాయనరెడ్డి ఆధ్వర్యంలో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది జగన్ సర్కార్.
కందుకూరు, గుంటూరులలో జరిగిన తొక్కిసలాటలపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఈ ఘటనలపై విచారణకు రిటైర్డ్ హైకోర్ట్ న్యాయమూర్తితో కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ శేషనాయనరెడ్డి ఆధ్వర్యంలో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది జగన్ సర్కార్. తొక్కిసలాటకు దారి తీసిన పరిస్ధితులు, బాధ్యులపై విచారణ చేయనుంది కమీషన్.
కాగా... గత బుధవారం రాత్రి నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన చంద్రబాబు రోడ్ షోలో తొక్కిసలాట చోటు చేసుకోవడంతో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు టీడీపీ నుంచి, పార్టీల నుంచి ఒక్కొక్కరికి రూ.24 లక్షల ఆర్ధిక సాయం అందించారు. అలాగే మృతుల పిల్లలకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా చదువు చెప్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అటు ఈ ఘటన పట్ల ప్రధాని నరేంద్ర మోడీ సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన ఆయన ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అలాగే ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్ జగన్ కూడా మృతుల కుటుంబాలు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
ఇది జరిగిన రోజుల వ్యవధిలోనే గుంటూరు జిల్లాలో ఆదివారం సాయంత్రం ఉయ్యూరు ఫౌండేషన్ ఆధ్వర్యంలో చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చంద్రబాబు సభలో ప్రసంగించి అక్కడి నుంచి వెళ్లిపోయిన కొద్దిసేపటికే.. తొక్కిసలాట చోటుచేసుకుంది. తొక్కిసలాటలో ఒక్కరు ఘటన స్థలంలో మృతిచెందగా.. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. పలువురు గాయపడ్డారు.