వైసిపి అభ్యర్ధిగా వేమిరెడ్డి..టిడిపికి షాక్
- వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విశాఖపట్నంలో ప్రకటించారు.
నెల్లూరు జిల్లాలో ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని వైసిపి రాజ్యసభ అభ్యర్ధిగా ప్రకటించింది. వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విశాఖపట్నంలో ప్రకటించారు. విశాఖలో నిర్మించిన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో విజయసాయి మాట్లాడుతూ వేమిరెడ్డిని పార్టీ నేతలకు పరిచయం చేయటం గమనార్హం.
పాదయాత్ర సందర్భంగా జగన్ నెల్లూరు జిల్లాలో ఉన్నపుడు వేమిరెడ్డి వైసిపి కండువా కప్పుకున్నారు. పోయిన ఎన్నికల్లో వైసిపికి మద్దతుగా నిలిచిన వేమిరెడ్డి తర్వాత పార్టీకి దూరమయ్యారు. వేమిరెడ్డిని టిడిపిలోకి చేర్చుకోవాలని టిడిపి నేతలు చాలా ప్రయత్నాలు చేసినా ఉపయోగం కనబడలేదు. రాజకీయాలకు దూరంగా ఉన్న వేమిరెడ్డి హటాత్తుగా మొన్నటి జగన్ పాదయాత్రలో వైసిపిలో చేరటంతో టిడిపికి పెద్ద షాక్ తగిలింది. ఎందుకంటే, వేమిరెడ్డి ఆర్ధికంగా బాగా స్తితిమంతుడు కావటమే కారణం.
వేమిరెడ్డిని పరిచయ కార్యక్రమం సందర్భంగా విజయసాయి మాట్లాడుతూ రాజ్యసభ సీటు దక్కించుకునేందుకు అవసరమైన 44 మంది ఎమ్మెల్యేలు తమకు ఉందన్నారు. అయితే తమ ఎంఎల్ఏలను ప్రలోభ పెట్టేందుకు టీడీపీ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. టీడీపీలోకి రావాలంటూ తమ ఎమ్మెల్యేలను మంత్రి కళా వెంకట్రావు వేడుకుంటున్నారని, కాళ్లు పట్టుకోవడం ఒక్కటే తక్కువని ఎద్దేవా చేశారు. రాజ్యసభ ఎన్నికల్లోపు వైసిపి నుండి ఎంఎల్ఏలు ఎవరూ టిడిపిలోకి ఫిరాయించకపోతే వేమిరెడ్డి గెలుపు ఖాయమనే చెప్పవచ్చు.