పెన్షన్ల పై జగన్ సంచలన నిర్ణయం..ఏంటో తెలుసా ? (వీడియో)
- పెన్షన్లపై తానిచ్చిన హామీకి సంబంధించి జరుగుతున్న వివాదంపై వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వివరణ ఇచ్చారు.
పెన్షన్లపై తానిచ్చిన హామీకి సంబంధించి జరుగుతున్న వివాదంపై వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వివరణ ఇచ్చారు. అంతేకాకుండా మరో సంచలన నిర్ణయం కూడా ప్రకటించారు. ‘జగన్ స్పీక్స్’ 2వ వీడియోను జగన్ విడుదల చేసారు. అందులో జనాలతో మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీలకు 45 ఏళ్ళకే పెన్షన్ హామీపై అనేకమంది అనేక ఆరోపణలు చేస్తున్నట్లు చెప్పారు. అటువంటి ఆరోపణలను కొట్టిపారేసారు. తాను ప్రకటించిన హామీ పథకానికి ‘వైఎస్సార్ చేయూత పథకం’ అని పేరు పెడుతున్నట్లు చెప్పారు. అదే సమయంలో పై వర్గాలకు సంబంధం లేని వారికి ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ వయస్సును 65 ఏళ్ళ నుండి 60 ఏళ్ళకే తగ్గిస్తానని కూడా ప్రకటించారు.
జగన్ స్పీక్స్ వీడియోలో జగన్ మాట్లాడుతూ, 600 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో విభిన్న అనుభవాలు ఎదురైనట్లు చెప్పారు. పెన్షన్ పథకం గురించి వివరిస్తూ, పనులకు పోతేగాని పూట గడవని కుటుంబాలు రాష్ట్రంలో అనేకం ఉన్నాయన్నారు. ఒక వారం పనులకు పోకపోతే పస్తులుండాల్సిన దారుణమైన పరిస్థితుల్లో వారు జీవనాన్ని గడుపుతున్నట్లు వాపోయారు.
అటువంటి కుటుంబాల్లోని ఇబ్బందులను స్వయంగా చూసిన వ్యక్తిగా కష్టజీవులకు, అట్టడుగువర్గాల పేదలకు 45ఏళ్లకే పింఛన్ నిర్ణయాన్ని ప్రకటించానట్లు వివరించారు. వైయస్ఆర్ చేయూత అనే పథకం ద్వారా నిరుపేద కుటుంబాలకు గొప్ప భరోసాను కల్పించి పేదలకు తోడుగా నిలబడతామని హమీ ఇచ్చారు.