బాబాయిపై కోడికత్తితో దాడిచేసిన అబ్బాయి.. చికిత్స పొందుతూ మృతి..
పాత కక్షల నేపథ్యంలో ఓ యువకుడు వరుసకు బాబాయ అయ్యే వ్యక్తిపై కోడికత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన అతను చికిత్స తీసుకుంటూ మృతి చెందాడు.

జంగారెడ్డిగూడెం : ఆంధ్ర ప్రదేశ్ లో మరో కోడి కత్తి ఘటన వెలుగు చూసింది. జంగారెడ్డిగూడెంలో పాత గొడవల నేపథ్యంలో ఓ యువకుడు వరుసకు బాబాయి అయ్యే వ్యక్తిపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. దీంతో బాబాయి తీవ్ర గాయాల పాలై మృతి చెందాడు. సోమవారం ఈ ఘటన జంగారెడ్డిగూడెం పట్టణంలో కలకలం సృష్టించింది. దీనికి సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి…
జంగారెడ్డిగూడెంలోని గాంధీ బొమ్మ సెంటర్ చెరువు రోడ్డులో ఇళ్ల శ్రీనివాస్ (23) అనే వ్యక్తి ఉంటున్నాడు. అతనికి గోసుల ఏడుకొండలు అలియాస్ బాలాజీ (27) వరుసకు బాబాయి అవుతాడు. వీరిద్దరి మధ్య పాత గొడవలు ఉన్నాయి. ఈ గొడవల నేపథ్యంలోనే ఇద్దరూ సర్దుబాటు చేసుకుందామని శ్రీనివాసు, ఏడుకొండలు తమ స్నేహితులతో కలిసి గాంధీ బొమ్మ సెంటర్ దగ్గరికి వచ్చారు.అక్కడికి వచ్చిన తర్వాత వారిద్దరి మధ్య సర్దుబాటు పక్కకి జరిగిపోయి మరోసారి గొడవ ముదిరింది.
భర్త ఇంటిముందు భార్య మృతదేహం పూడ్చివేత... వైసీపీ నాయకుల అండతో అరాచకం...
అది తీవ్ర స్థాయికి చేరింది. దీంతో శ్రీనివాసు తన వెంట తెచ్చుకున్న కోడి కత్తితో ఏడుకొండలపై దాడికి దిగాడు. విచక్షణ రహితంగా దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో ఏడుకొండలు తీవ్ర రక్తస్రావమై అక్కడే పడిపోయాడు. వారితో వచ్చిన స్నేహితులు వెంటనే అతడిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యుల అతనికి అత్యవసర చికిత్స అందించారు. చికిత్స తీసుకుంటూనే బాలాజీ మృతి చెందాడు. కాగా, మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాలాజీ పెయింటర్ గా పనిచేస్తున్నాడు. దీనికి సంబంధించిన సమాచారం అందడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.