క్రికెట్ ఆడుతుండగా మైదానంలో పిడుగు... యువకుడు దుర్మరణం, ఇద్దరికి గాయాలు
యువకులంతా సరదాగా క్రికెట్ ఆడుతుండగా ఒక్కసారిగా పిడుగు పడటంతో ఒకరు మృతిచెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన విజయనగరంలో చోటుచేసుకుంది.
![Youngster died and two injured in Vijayanagaram AKP Youngster died and two injured in Vijayanagaram AKP](https://static-ai.asianetnews.com/images/71243c94-108d-40e1-8a98-f191af31a530/image_363x203xt.jpg)
విజయనగరం : దేశవ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలు ప్రమాదాలు సృష్టిస్తూ ప్రాణాలు బలితీసుకుంటున్నారు. మంగళవారం తెలంగాణ సరిహద్దుల్లో ఓ కుటుంబం మొత్తం పిడుగుపాటుకు బలయిన విషాద ఘటన మరువక ముందే ఆంధ్ర ప్రదేశ్ లో మరో యువకుడు పిడుగుపాటుతో మృతిచెందారు. యువకులంతా సరదాగా క్రికెట్ ఆడుతుండగా మైదానంలో పిడుగుపడి ఒకరు ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
వివరాల్లోకి వెళితే... విజయనగరం గాజులరేగ ప్రాంతానికి చెందిన ఇజ్రాయెల్(22) పోలీస్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నాడు. ఇప్పటికే రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అతడు దేహదారుడ్య పరీక్షలకు సన్నద్దం అవుతున్నాడు. ఇంతలోని అతడి పోలీస్ కలను చిదిమేస్తూ పిడుగుపాటు ప్రాణాలను బలితీసుకుంది.
మంగళవారం సాయంత్రం ఇజ్రాయెల్ స్నేహితులతో కలిసి స్థానిక మైదానం సరదాగా క్రికెట్ ఆడుతుండగా పిడుగు పడింది. ఇజ్రాయెల్ కు సమీపంలో పిడుగు పడటంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ఇద్దరు యువకులకు కూడా గాయాలుకాగా దూరంగా వున్న నలుగురు క్షేమంగా బయటపడ్డారు.
Read More విషాదం.. కైవల్యా నదిలో మునిగి ఇద్దరు మృతి.. తిరుపతి జిల్లాలో ఘటన
కూలీ పనులు చేసుకుంటూ కొడుకు ఇజ్రాయెల్ ను చదివించుకున్నారు తల్లిదండ్రులు మరియమ్మ-యాకూబ్. తీరా అతడికి ఉద్యోగం వచ్చే సమయానికి విధి వింతనాటకానికి తెరతీసింది. కొడుకును దూరం చేసి ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది.
గాయపడిన యువకులిద్దరు కాలిన గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వీరు కూడా నిరుపేద కుటుంబాలకు చెందినవారే కావడంతో వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించి ఉచితంగా వైద్యసాయం అందించాలని కోరుతున్నారు. ప్రకృతి వైపరిత్యాల కారణంగా ఒక్కగానొక్క కొడుకును కోల్పోయిన ఇజ్రాయెల్ తల్లిదండ్రులకు కూడా ప్రభుత్వం ఆర్థికసాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఇదిలావుంటే తెలంగాణ సరిహద్దులోని మహారాష్ట్ర ప్రాంతంలో పిడుగుపడి ఓ కుటుంబం మొత్తం బలయ్యింది. గడ్చిరోలి జిల్లాలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తున్న సమయంలో భరత్ రాజ్ గడె తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి బైక్ పై ప్రయాణిస్తున్నాడు. ఓ శుభకార్యానికి హాజరై తిరిగి వెళుతుండగా వర్షం ఎక్కువ కావడంతో రోడ్డుపక్కన ఓ చెట్టుకింద ఆగారు. ఇదే సమయంలో ఆ చెట్టుపై పిడుగుపడింది. దీంతో ఆ నలుగురు కుటుంబ సభ్యులు మొత్తం అక్కడే మరణించారు. ఈ ఘటనతో వారి స్వగ్రామం అమ్ వావ్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడంతో ఆ గ్రామస్తులంతా కన్నీరుమున్నీరయ్యారు.