పిడుగురాళ్లలో విషాదం... లాడ్జి గదిలో యువతీ యువకుడు సూసైడ్
లాడ్జీ గదిలో యువతీ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషాద ఘటన పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో చోటుచేసుకుంది.

పిడుగురాళ్ళ : ఉరి వేసుకుని యువతి... కత్తితో చేతులు, గొంతు కోసుకుని యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇలా లాడ్జీలోని ఒకేగదిలో యువతి మృతదేహం... రక్తపుమడుగులో యువకుడు కనిపించడం కలకలం రేపింది. ఈ ఘటన పల్నాడు జిల్లాలో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే... పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలోని పృథ్వీ లాడ్జ్ లో షేక్ షబ్బీర్(23), ఆయేషా బేగం(21) ఇవాళ(గురువారం) ఉదయం దిగారు. ఒకే గదిని తీసుకున్న వీరిద్దరూ అందులోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆయేషా గదిలోని సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకోగా... షబ్బీర్ కత్తితో చేతులు, గొంతు కోసుకున్నాడు. లాడ్జ్ సిబ్బంది వీరిని గమనించి పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు పృథ్వీ లాడ్జ్ కు చేరుకున్నారు. అయితే అప్పటికే యువతి మృతిచెందగా యువకుడు రక్తపుమడుగులో అపస్మారక స్థితిలో పడివున్నాడు. అతడిని వెంటనే దగ్గర్లోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. అనంతరం యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
Read More భార్యతో గొడవ .. మద్యం మత్తులో నాటు బాంబు కొరికిన మందుబాబు
యువతీ యువకుడు ఇద్దరూ కుమ్మరిపాలెంకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ప్రేమ వ్యవహారమే వీరి ఆత్మహత్యాయత్నానికి కారణమని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
(జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 ) కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.)