శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మం దేవాలయం వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. చెెరకు రసం మిషన్ లో చున్నీ ఇరుక్కుని యువతి మృతిచెందింది.
శ్రీకాకుళం : చెరకు రసం తీసే మిషన్ ఓ యువతి ప్రాణం తీసింది. చెరకు మిషన్ లో చున్నీ చిక్కుకుని యువతి మెడకు ఉరితాడులా మారింది. దీంతో ఊపిరాడక బాలిక మృతిచెందింది. ఈ దుర్ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసులు, మృతురాలి తల్లిదండ్రులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మనాథాలయం వద్ద గాయత్రి(18) అనే యువతి చెరకు రసం బండి నడిపుకుంటూ కుటుంబానికి ఆసరాగా వుంటోంది. పేద కుటుంబానికి చెందిన యువతి రోజూ మాదిరిగానే ఆదివారం కూడా చెరకు రసం బండివద్దకు వెళ్లింది. సాయంత్రం చెరకు గడలను మిషన్ లో పెట్టి రసం తీస్తుండగా ప్రమాదవశాత్తు చున్నీ కూడా అందులో ఇరుక్కుపోయింది. దీంతో చున్నీకాస్త ఆమె మెడకు ఉరితాడులా బిగుసుకుని ఊపిరాడక స్పృహ కోల్పోయింది.
చుట్టుపక్కల వ్యాపారాలు చేసుకునేవారు గాయత్రిని కాపాడి రిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో యువతి మృతిచెందింది. కూతురి మరణం ఆ తల్లిదండ్రులకు దు:ఖంలో ముంచింది. గాయత్రి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Read More ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డులో వర్షపు నీటిలో నిలిచిన కారు.. స్నేహితుల సాయంతో దంపతులకు తప్పిన ముప్పు..!!
గాయత్రి మృతిపై సమాచారం అందుకున్న పోలీసులు కుటుంబసభ్యులు, స్థానికుల నుండి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాధతో వున్న యువతి కుటుంబసభ్యులను వైఎస్సార్ సిపి యువనేత ధర్మాన రామ్మనోహర్ నాయుడు పరామర్శించారు.
