వికేంద్రీకరణ బిల్లుపై రగడ...మండలి డిప్యూటీ ఛైర్మన్ నిర్ణయానికే మంత్రుల అడ్డు
ఏపి శాసనమండలిలో రాజధాని బిల్లులపై మరోసారి ఉత్కంఠ కొనసాగుతోంది.
అమరావతి: ఏపి శాసనమండలిలో రాజధాని బిల్లులపై మరోసారి ఉత్కంఠ కొనసాగుతోంది. సీఆర్డీఏ రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులపై ముందు చర్చ చేపట్టాలని అధికారపార్టీ పట్టుబడుతుంటే ప్రతిపక్షాలు మాత్రం అడ్డుకుంటున్నాయి. అయితే తొలుత ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చకే శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం అనుమతివ్వడంతో మాటలయుద్దం మొదలయ్యింది.
డిప్యూటీ ఛైర్మన్ అనుమతించగానే ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టేందుకు మంత్రి బుగ్గన సిద్ధమవగా మరో మంత్రి బొత్స సత్యనారాయణ అడ్డుకున్నారు. ద్రవ్య వినిమయ బిల్లు ను అప్పుడే ప్రవేశపెట్టవద్దని...సీఆర్డీఏ రద్దు,మూడు రాజధానులు బిల్లులు ముందుగా చర్చకు పెట్టాలని ఛైర్మన్ ను కోరారు బొత్స.
read more రెండు కీలక బిల్లులు: మండలిలో 15 మంది మంత్రులు, సై అంటున్న టీడీపీ
కానీ ద్రవ్య వినిమయ బిల్లు తర్వాతే మిగతా బిల్లులపై చర్చిద్దామని డిప్యూటీ చైర్మన్ సూచించారు. ఎప్పుడు ఏ బిల్లు పెట్టాలి అన్నదానిపై తనకు పూర్తి అధికారం ఉందని డిప్యూటీ చైర్మన్ స్పష్టం చేశారు. ద్రవ్యవినిమాయ బిల్లు రాజ్యాంగ ఆబలిగేషన్ అని... అది అయ్యాక మిగిలిన బిల్లులపై ఆలోచిద్దామని యనమల సూచించారు. ఈ వ్యాఖ్యలపై మంత్రులు బుగ్గన, బొత్స అభ్యంతరం వ్యక్తం చేశారు.
ద్రవ్య వినిమయ బిల్లు చివరిగా చేపట్టడం సాంప్రదాయం అని బుగ్గన అన్నారు. గతంలో ఎప్పుడైనా ద్రవ్య వినిమయ బిల్లు తర్వాత వేరే బిల్లులు చేపట్టారా..? అని బుగ్గన నిలదీశారు. అయితే ఏ బిల్లు తీసుకోవాలన్న దానిపై ఓటింగ్ పెట్టాలని యనమల సూచించారు.
అన్ని బిల్లులకు తాము సహకరించాం కాబట్టి ఈ బిల్లు విషయంలో తమ మాట వినాలని...ముందుగా ద్రవ్య వినిమయ బిల్లు పెట్టాలని టిడిపి సభ్యులు పట్టుబట్టారు. దీంతో సభలో ప్రతిష్టంభన ఏర్పడగా 15 నిమిషాలు మండలి వాయిదా వేశారు డిప్యూటీ చైర్మన్.