కర్నూలు ఎంఎల్సీ: వైసిపి షాకింగ్ డెసిషన్
- కర్నూలు ఎంఎల్సీ ఎన్నికలకు సంబంధించి అధినేత షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.
కర్నూలు ఎంఎల్సీ ఎన్నికలకు సంబంధించి అధినేత షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. స్ధానిక సంస్ధల ఎంఎల్సీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని సోమవారం సాయంత్రం పార్టీ సీనియర్ నేతల సమావేశంలో జగన్ నిర్ణయించారు. టిడిపి అప్రజాస్వామికంగా నడుచుకుంటోందని, అన్నీ వ్యవస్ధలను కాలరాస్తోందని ఆరోపిస్తూ పోటీ నుండి విరమించుకోవటం ఆశ్చర్యంగా ఉంది. పార్టీ హై కమాండ్ తీసుకున్న నిర్ణయం చాలా మంది నేతలకు మింగుడు పడటం లేదు. జగన్ నిర్ణయంతో పలువురు నేతలు ఏకీభవించలేకపోతున్నా చేసేది లేక మాట్లాడకుండా కూర్చున్నారు.
పోటీ నుండి విరమించుకోవటం సరైన చర్య కాదని పలువురు నేతలు అభిప్రాయపడతున్నారు. గౌరు వెంకటరెడ్డి పోటీలో ఉంటారని అందరూ అనుకున్నారు. అటువంటిది హటాత్తుగా పోటీ నుండే పార్టీ తప్పుకుంటున్నట్లు చేసిన ప్రకటనను చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. గౌరు బావైన శివానందరెడ్డినే పోటీలోకి దింపాలని టిడిపి యోచిస్తోందని ప్రచారం మొదలైన తర్వాతే వైసిపి షాకింగ్ నిర్ణయం తీసుకోవటం గమనార్హం. ఒకవేళ అదే నిజమైతే, 2019 ఎన్నికల్లో వైసిపి బంధువులనే చంద్రబాబు అన్నీ నియోజకవర్గాల్లో పోటీ పెడితే అప్పుడసలు మొత్తం ఎన్నికలనే బహిష్కరిస్తారా అంటూ పలువురు నేతలు చర్చించుకుంటున్నారు.