పీఏసీ సభ్యుడిగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి
కేంద్ర ప్రభుత్వ ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) సభ్యుడిగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయసాయి రెడ్డితోపాటు బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది కూడా ఎన్నికైనట్టు రాజ్యసభ సెక్రెటరీ జనరల్ వెల్లడించారు.
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ) సభ్యుడిగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ దేశ్ దీపక్ వర్మ ఓ అధికారిక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవలే కేంద్రమంత్రివర్గం ప్రక్షాళన గావించినప్పుడు పీఏసీ సభ్యులుగా వ్యవహరించిన భూపేశ్ యాదవ్, రాజీవ్ చంద్రశేఖర్లకు క్యాబినెట్లో చోటు లభించింది. తత్ఫలితంగా పీఏసీలో వీరిరువురి స్థానాలు ఖాళీ అయ్యాయి. ఈ రెండు స్థానాలను భర్తీ చేయడానికి నామినేషన్లు ఆహ్వానించగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, బీజేపీ నేత డాక్టర్ సుధాంశు త్రివేదిలు నామినేషన్లు వేశారు. ఇతరులెవరూ నామినేషన్ వేయలేదు. పోటీలో ఎవరూ లేకపోవడంతో వీరిద్దరు పీఏసీకి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రాజ్యసభ సెక్రెటరీ జనరల్ ఓ బులెటిన్లో తెలిపారు.