వివేకా హత్యకేసులో వైఎస్ అవినాష్ అరెస్ట్ ఖాయం : వైసిపి ఎమ్మెల్యే సంచలనం
వైఎస్ వివేేకానంద రెడ్డి హత్యకేసులో జరుగుతున్న పరిణామాలపై స్పందిస్తూ వైసిపి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు.
![YCP MLA Rachamallu Shivaprasad Reddy Sensational comments on YS Viveka murder case AKP YCP MLA Rachamallu Shivaprasad Reddy Sensational comments on YS Viveka murder case AKP](https://static-ai.asianetnews.com/images/75ff10e1-ed4e-4199-ba8a-6ae8ba719d77/image_363x203xt.jpg)
కడప : మాజీ మంత్రి, ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసు సంచలనంగా మారింది. ఈ హత్య కేసు విచారణ బాధ్యతలు సిబిఐకి అప్పగించిన తర్వాత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే వివేకా హత్యతో సంబంధాలున్నాయని అనుమానిస్తూ ఇప్పటికే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి.సీఎం సతీమణి వైఎస్ భారతి సొంత మేనమామ భాస్కర్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో అవినాష్ రెడ్డిని కూడా సిబిఐ అరెస్ట్ చేయడం ఖాయం అంటూ వైసిపి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు.
వైఎస్ వివేకా హత్యకేసులో చోటుచేసుకుంటున్న పరిణామాలపై చర్చించేందుకు కడప నాయకులతో అవినాష్ రెడ్డి సమావేశమయ్యారు. కడప పట్టణంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో జరిగిన ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం రాచమల్లు సంచలన వ్యాఖ్యలు చేసారు.
వివేకా హత్యకేసులో అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేయడం ఖాయమని రాచమల్లు అన్నారు. అయితే అరెస్టయినప్పటికీ బెయిల్ పై బయటకు వస్తారని అన్నారు. అవినాష్ రెడ్డి ఏ నేరమూ చేయలేదు... వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఇరికించారని అన్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కుట్రపన్ని అవినాష్ ను వివేకా హత్యకేసులో ఇరికించాడని ఆరోపించారు. రాజకీయంగా నేరుగా ఎదుర్కోలేకే ఇలా కుట్రలతో దెబ్బతీయాలని చూస్తున్నారని రాచమల్లు పేర్కొన్నాడు.
Read More వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్: విచారణ రేపటికి వాయిదా
ప్రజా సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చిన అవినాష్ రెడ్డి హింసను ప్రేరేపించే వ్యక్తి కాదని... ఇది ఇప్పటికీ తాను నమ్ముతున్నానని అన్నారు. నిందితుడిగా చేర్చినంత మాత్రాన నేరం చేసినట్లు కాదని అన్నారు. నిజంగానే వివేకా హత్యలో అవినాష్ రెడ్డి పాత్ర వుందని రుజువైతే రాజకీయాల నుండి తప్పుకుంటానని అన్నారు. సిబిఐ అనుమానించడం కాదు కోర్టులో నేరం రుజువైన వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని మరోసారి స్పష్టం చేసారు వైసిపి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి.
తమ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేస్తే ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై చర్చించేందుకే సమావేశమైనట్లు రాచమల్లు వెల్లడించారు. వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్, తెలంగాణ హైకోర్టులో అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్, సుప్రీం కోర్టు విచారణపై తదితర అంశాలపై చర్చించినట్లు రాచమల్లు తెలిపారు.