వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్: విచారణ రేపటికి వాయిదా
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను రేపటికి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు.
![Telangana High Court Adjourns Kadapa MP YS Avinash Reddy anticipatory bail petition hearing to On April 27 Telangana High Court Adjourns Kadapa MP YS Avinash Reddy anticipatory bail petition hearing to On April 27](https://static-ai.asianetnews.com/images/01dbmmxsayyhmzpjczpsv41674/YS-Avinash-Reddy--Kadapa-_363x203xt.jpg)
హైదరాబాద్: కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను ఈ నెల 27వ తేదీ మధ్యాహ్నానికి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. మరో వైపు ఈ విషయమై ఎల్లుండి వాదనలు విన్పించేందుకు అనుమతివ్వాలని వైఎస్ సునీతారెడ్డి తరపు న్యాయవాది హైకోర్టును కోరారు. ఇవాళ ఉదయం హైకోర్టు ప్రారంభం కాగానే వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారించాలని హైకోర్టును కోరారు.
అయితే ఇవాళ లిస్టైన కేసుల జాబితాలో వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ అంశం లేదని హైకోర్టు తెలిపింది. లిస్ట్ కాని పిటిషన్లపై ఎలా విచారణ చేస్తామని హైకోర్టు ప్రశ్నించింది. ఈ పిటిషన్ పై రేపు మధ్యాహ్నం మూడున్నర గంటలకు విచారణ నిర్వహిస్తామని హైకోర్టు తెలిపింది. ఇదిలా ఉంటే ఈ విషయమై తమకు ఎల్లుండి వాదనలు విన్పించేందుకు అవకాశం కల్పించాలని వైఎస్ సునీతారెడ్డి తరపు న్యాయవాది హైకోర్టును కోరారు.
ఈ నెల 16వ తేదీన వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. దీంతో ఈ నెల 17న తెలంగాణ హైకోర్టులో వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 17, 18 తేదీల్లో విచారణ నిర్వహించిన హైకోర్టు ముందస్తు బెయిల్ పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నెల 25న తుది తీర్పును ఇస్తానని తెలిపింది.
తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో వైఎస్ సునతారెడ్డి సవాల్ చేశారు.ఈ నెల 21న వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అయితే ఈ నెల 24వ తేదీ వరకు అరెస్ట్ చేయవద్దని సీబీఐని ఆదేశించింది. ఈ నెల 24వ తేదీన ఈ పటిషన్ పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో తేల్చుకోవాలని స్పష్టం చేసింది. మరో వైపు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పక్కన పెట్టింది.
also read:వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ : విచారణ రేపటికి వాయిదా
మంగళవారంనాడు హైకోర్టులో వైఎస్ అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది ఈ విషయాన్ని మెన్షన్ చేశారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చిన తర్వాత విచారణ చేస్తామని హైకోర్టు తెలిపింది. నిన్న మధ్యాహ్నం సుప్రీంకోర్టు తీర్పు అప్ లోడ్ అయింది. ఈ విషయాన్ని అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి నిన్న మధ్యాహ్నం తీసుకెళ్లారు. అయితే ఈ పిటిషన్ పై ఈ నెల 26న విచారణ చేస్తామని హైకోర్టు తెలిపింది. కానీ ఈ నెల 26న లిస్టైన కేసుల జాబితాలో వైఎస్ అవినాష్ రెడ్డి పిటిషన్ లేదు. దీంతో ఈ పిటిషన్ పై విచారణను రేపు నిర్వహిస్తామని హైకోర్టు తెలిపింది.