చంద్రబాబు ఇంటికి కూడా వైసీపీ రంగులు వేస్తాం.. ఎమ్మెల్యే జోగి కామెంట్స్
జోగి రమేష్ మాట్లాతున్న సమయంలో వైవీబీ లేచి రుణమాఫీని రద్దు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెం.99ను జారీ చేసిందని, దీంతో జిల్లాలో వెయ్యి కోట్లను రైతులు నష్ట పోయారని అన్నారు.
చంద్రబాబు ఇంటికి కూడా వైసీపీ రంగులు వేస్తామంటూ ఆ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏపీలోకి పంచాయతీ భవనాలన్నింటికీ వైసీపీ రంగులు వేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని టీడీపీ నేత ఒకరు ప్రశ్నించగా... ఎమ్మెల్యే జోగి రమేష్ ఈ విధంగా స్పందించారు.
పూర్తి వివరాల్లోకి వెళితే... రైతుభరోసా అంశంపై శుక్రవారం కృష్ణా జిల్లాలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైవీబీ, జోగి మధ్య పలుమార్లు వాగ్వాదం చోటు చేసుకుంది. జోగి రమేష్ మాట్లాతున్న సమయంలో వైవీబీ లేచి రుణమాఫీని రద్దు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెం.99ను జారీ చేసిందని, దీంతో జిల్లాలో వెయ్యి కోట్లను రైతులు నష్ట పోయారని అన్నారు.
దీంతో ‘నేను మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడకూడదు కూర్చోవోయ్.. నిన్ను కొడతా’ అంటూ జోగి... వైవీబీని ఉద్దేశించి అన్నారు. మరో సందర్భంలో వైవీబీ మాట్లాడుతూ....‘పంచాయతీ భవనాలకు వైసీపీ రంగులు వేస్తున్నారు... ఈ అధికారం మీకు ఎవరిచ్చారు... ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన నగదుతో పంచాయతీ భవనాలకు, కమ్యూనిటీ హాళ్లకు పార్టీ రంగులు వేస్తారా’ అని ప్రశ్నించారు. ఈ సమయంలో జోగి కలుగ జేసుకుని మీ ఇంటికి, చంద్రబాబు ఇంటికి కూడా రంగులు వేస్తాం... ఏం చేసుకుంటావో చేసుకో అంటూ దురుసుగా మాట్లాడారు.