కోర్టు ఆదేశాల ప్రకారం ఆళ్ళ నెలరోజుల్లో రూ. 27.44 కోట్లు చెల్లించేసారు. కోర్టు చెప్పినట్లు ప్రభుత్వం 84 ఎకరాలను ఆళ్ళకి రిజిస్టర్ చేస్తుందో లేదో చూడాలి.

కోర్టు ఆదేశాల ప్రకారం మంగళగిరి వైసీపీ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి సదావర్తి భూములను రూ. 27.44 కోట్లు చెల్లించేసారు. వందలకోట్లరూపాయలు విలువచేసే తమిళనాడులోని 84 ఎకరాల సదావర్తిభూములను తన మద్దతుదారుడైన రామానుజయ్యకు చంద్రబాబునాయుడు కట్టబెట్టిన సంగతి తెలిసిందే. మరీ చీప్ గా అంటే రూ. 22 కోట్లకే తమ మద్దతుదారుడికి చంద్రబాబు కట్టబెట్టేసారు. ఎప్పుడైతే విషయం వెలుగు చూసిందో వెంటనే ఆళ్ళ కోర్టును ఆశ్రయించారు. సరే, తరువాత జరిగిన విషయమంతా అందరికీ తెలిసిందే.

ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టిన కోర్టు ప్రభుత్వం నిర్ణయించిన రూ. 22 కోట్లకన్నా రూ. 5 కోట్లు ఎక్కువిచ్చిన వారికి సదావర్తి భూములను సొంతం చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. అదే సమయంలో ఆళ్ళకు డబ్బులు కట్టే అవకాశం ఇచ్చిన విషయాన్ని కూడా స్పష్టం చేసింది. మొదటి వాయిదా క్రింద రూ 10 కోట్లు చెల్లించిన ఆళ్ల శుక్రవారం చివరి వాయిదా రూ. 17.44 కోట్లు చెల్లించేసారు.

మొత్తానికి కోర్టు ఆదేశాల ప్రకారం ఆళ్ళ నెలరోజుల్లో రూ. 27.44 కోట్లు చెల్లించేసారు. ఇక, సదావర్తి భూములను ప్రభుత్వం ఆళ్ళకి రిజిస్టర్ చేయటమే మిగిలింది. మరి, కోర్టు చెప్పినట్లు ప్రభుత్వం 84 ఎకరాలను ఆళ్ళకి రిజిస్టర్ చేస్తుందో లేదో చూడాలి. మొత్తానికి ఆళ్ళ చేతిలో చంద్రబాబుకు భంగపాటైతే తప్పలేదు.