‘చంద్రబాబు మళ్లీ నాటకాలు మొదలుపెట్టాడు’
చంద్రబాబుపై మండిపడ్డ వైసీపీ నేతలు
నవ నిర్మాణ దీక్ష పేరుతో చంద్రబాబు మరో కొత్త నాటకానికి తెర లేపారని వైసీపీ నేతలు ఆరోపించారు. ప్రజలను వంచించడానికే ఈ నవ నిర్మాణ దీక్ష చంద్రబాబు చేపట్టారని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రానికి హోదా కోసం మొదటి నుంచి పోరాడింది.. ఇప్పుడు పోరాడుతోంది తమ వైసీపీ నేనని పేర్కొన్నారు.
ఏపీకి హోదా కోసం ఢిల్లీ నగర వీధుల్లో ఉద్యమాలకు శ్రీకారం చుట్టింది వైసీపీ అధినేత జగన్ అని గుర్తు చేశారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని దేశానికి చాటి చెప్పిన ప్రగతిశీలి వైఎస్ జగన్ అని పేర్కొన్నారు. గత నాలుగేళ్లలో చంద్రబాబు మూడున్నర లక్షల కోట్లు దోచేశారని భూమన ఆరోపించారు. రాజధాని పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారని, చంద్రబాబు పాలనను కూకటివేళ్లతో పెకలించడానికి సిద్ధం కావాలంటూ ఏపీ ప్రజలకు పిలుపునిచ్చారు.
ఏపీ ప్రయోజనాల కోసం రాజీనామాలు చేశాం. ప్రత్యేక హోదా ఇవ్వండి, లేని పక్షంలో మా రాజీనామాలు అమోదించాలని’ వైఎస్సార్సీపీ ఎంపీ వరప్రసాద్ కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ ఓ అహంకారి అని, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసమర్ధుడని.. అందుకే ఏపీకి సంజీవని లాంటి హోదా రాలేదని తెలిపారు.
హోదా రాకపోవడానికి 40 శాతం కేంద్ర తప్పిదాలు కారణమైతే, 60 శాతం అసమర్ధుడైన చంద్రబాబు నాయుడే కారణమంటూ మండిపడ్డారు. రాష్ట్రంలోని టీడీపీ, కేంద్రంలోని బీజేపీ కలిసి ఏపీని వంచించాయని ఎంపీ వరప్రసాద్ పేర్కొన్నారు.