స్పీకర్ తమ్మినేని ఇలాకాలో వివాదం... జనసేన అసెంబ్లీ ఇంచార్జిపై వైసిపి శ్రేణుల దాడి
జనసేన పార్టీ ఆంధ్ర ప్రదేశ్ లోని రోడ్ల దుస్థితిపై చేపట్టిన సోషల్ మీడియా ఉద్యమం అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని నియోజకవర్గం ఆముదాలవలసలో ఉద్రిక్తతతకు దారితీసింది.
శ్రీకాకుళం: ఆంధ్ర ప్రదేశ్ లో రోడ్ల దుస్థితిపై జనసేన పార్టీ చేపట్టిన నిరసన శ్రీకాకుళం జిల్లాలో ఉద్రిక్తంగా మారింది. జనసేన పార్టీ పిలుపుమేరకు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సొంత నియోజకవర్గం ఆముదాలవలసలో అధ్వాన్నంగా మారిన రోడ్లను ఫోటోలు తీసి ఓ భారీ ప్లెక్సీని ఏర్పాటుచేసారు జనసేన నాయకులు. అయితే ఆ ప్లెక్సీలో స్పీకర్ తమ్మినేని ఫోటోను కూడా వాడటంతో జనసేన-వైసిపిల మధ్య వివాదం చెలరేగింది. ఈ క్రమంలోనే జనసేన నియోజకవర్గ ఇంచార్జిపై వైసిపి నాయకులు దాడికి పాల్పడ్డారు.
వివరాల్లోకి వెళితే... సెప్టెంబర్ 2, 3, 4 తేదీల్లో రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిపై #JSPFORAPROADS ద్వారా ప్రతి ఒక్క జనసైనికుడు, వీరమహిళ, ఊరు బాగుకోరే ప్రతి ఒక్కరు పాడైన రోడ్ల ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయాలని జనసేన పిలుపునిచ్చింది. దీంతో శ్రీకాకుళం జిల్లా ఆముదాలవస నియోజకవర్గ పరిధిలో కూడా పాడయిపోయిన రోడ్లను కూడా ఫోటోలుతీసిన జనసేన నాయకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతటితో ఆగకుండా ఆముదాలవలస పట్టణంలోని వైఎస్సార్ కూడలి వద్ద స్థానిక ఎమ్మెల్యే, అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని ఫోటోతో ఓ ప్లెక్సీ ఏర్పాటుచేశారు. ఈ ప్లెక్సీ వివాదానికి దారితీసింది.
read more అడుగుకో గుంత-గజానికో గొయ్యి... ఇదీ ఏపీలో రోడ్ల దుస్థితి: పవన్ కల్యాణ్ ఆగ్రహం
జనసేన నాయకులు ఏర్పాటుచేసిన ప్లెక్సీపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వైసిపి నాయకులు ముున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు ఆ ప్లెక్సీని తొలగిస్తుండగా జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జి పేడాడ రామ్మోహనరావు అక్కడికి చేరుకుని వారిని ప్రశ్నించారు. దీంతో అక్కడే వున్న వైసిపి నాయకులు, కార్యకర్తలు రామ్మోహన్ రావుపై దాడిపై దాడికి పాల్పడ్డారు. దీంతో అతడు తీవ్రంగా గాయపడి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.
ఈ దాడి సమయంలో అక్కడే వున్న పోలీసులు వైసిపి నాయకులను నిలువరించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఆవేశంతో వైసిపి నాయకులు రామ్మోహన్ పై దాడికి పాల్పడ్డారు. ఈ దాడినుండి ఎలాగోలా తప్పించుకున్న అతడు గాయాలతో హాస్పిటల్లో చేరాడు.