హోదా పోరాటానికి జగన్ బ్రాండ్ అంబాసిడర్
చంద్రబాబు సొంత నియోజకవర్గాన్నే అభివృద్ధి చేయలేదు
రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించడం కోసం చేసే పోరాటానికి వైసీపీ అధినేత జగన్ బ్రాండ్ అంబాసిడర్ అని పుంగనూరు ఎమ్మెల్యే పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. కాంగ్రెస్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిందని ఆరోపించారు.
ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ ప్రధాన దోషిగా నిలిచి పోతుందన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు నీతి, నియమాలు లేవని, కేవలం కుట్ర పూరిత రాజకీయాలు చేయడమే ఆయనకు అలవాటంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు అనేక దుర్మార్గాలు చేశారు కాబట్టి హోదాపై మాట మార్చారని చెప్పారు.
ప్రస్తుతం ఏం చేయలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ నేతలకు చంద్రబాబు దగ్గరవుతున్నారని పేర్కొన్నారు. 10 లక్షల మందికి చంద్రబాబు నిరుద్యోగ భృతి ఇస్తామంటున్నారని.. ఆ 10 లక్షల మంది టీడీపీ కార్యకర్తలేనని పెద్దిరెడ్డి విమర్శించారు.
గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా చంద్రబాబు అమలు చేయలేదు అని కోటంరెడ్డి శ్రీదర్రెడ్డి వంచనపై గర్జన దీక్షలో గుర్తుచేశారు. మీ స్వగ్రామం నారావారిపల్లెలో అయినా కనీసం హామీలు నెరవేర్చారా అని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబును కోటంరెడ్డి ప్రశ్నించారు.
రాజన్న తనయుడు, జననేత వైఎస్ జగన్ పోరాటాలతోనే ప్రత్యేక హోదా అంశం ఇంకా సజీవంగా ఉందన్నారు. హోదా సాధన కోసం వైఎస్సార్సీపీ ఆమరణ దీక్షలు, యువభేరిలు, బంద్లు చేయగా.. అధికారంలో ఉండి కూడా చంద్రబాబు ఏం చేయలేకపోయారంటూ విమర్శించారు. జేసీ బ్రదర్స్ సీఎం చంద్రబాబు బంట్రోతుల్లా తయారయ్యారంటూ ఎద్దేవా చేశారు.