ఎమ్మెల్యే రాజాసింగ్ కి వైసీపీ నేత సవాల్
రాజాసింగ్ తాను చేసిన ఆరోపణలను నిరూపిస్తే ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై ఏపీ రాష్ట్ర ముస్లిం మైనారిటీ అధ్యక్షుడు, వైసీపీ నాయకుడు రజాక్ ఫైర్ అయ్యారు. రాజాసింగ్ కి రజాక్ సవాల్ కూడా విసిరారు. శ్రీశైలం ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి తనను అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాడ్డుతున్నారంటూ చేసిన ఆరోపణలు నిరూపించగలవా? అని ఓపెన్ ఛాలెంజ్ చేశారు. రాజాసింగ్ తాను చేసిన ఆరోపణలను నిరూపిస్తే ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు.
మల్లకార్జునస్వామిని ఏ మతం వారైనా పూజించవచ్చునని అన్నారు. అలా పూజించకూడదని మీ మత గ్రంధంలో ఏమైనా రాశారా? లేకపోతే రాజ్యాంగంలో రాశారా? అంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ను రజాక్ నిలదీశారు. శ్రీశైలం దేవస్థానంలో తన పేరుమీద పైసా పని కూడా తాను చేయలేదని స్పష్టం చేశారు. తన ముస్లిం సోదరులకు కూడా దేవస్థానంలో ఎలాంటి కాంట్రాక్టులు కూడా ఇప్పించలేదని రజాక్ తేల్చి చెప్పారు. ఆరోపణలు చేసే ముందు ఒకసారి ఆలోచించుకోవాలని రాజాసింగ్కు రజాక్ హితవు చెప్పారు.