‘‘కాళ్లబేరానికి వెళ్లినా..యుద్ధంలాగే కనపడుతోంది’’
చంద్రబాబుపై బుత్తుల సీరియస్ కామెంట్స్
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై యుద్ధం చేయడంలేదని.. తనపై ఉన్న ఓటుకు నోటు కేసును తొలగించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి అభిప్రాయపడ్డారు. తాజాగా చంద్రబాబు ప్రధాని నరేంద్రమోదీని కలిసిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా వారు దిగిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఆ ఫోటోలో చంద్రబాబు కాస్త వంగి.. చిరు నవ్వులు చిందిస్తూ మోదీతో కరచాలనం చేసినట్టుగా ఉన్నాయి. దీంతో.. దీనిపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఫోటో గురించి బత్తుల మాట్లాడుతూ చంద్రబాబుపై మండిపడ్డారు.
లాలూచీ రాజకీయాలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని మండిపడ్డారు. బీజేపీతో చంద్రబాబు లాలూచీ కొనసాగుతోందని, దానికి నిదర్శనమే ఢిల్లీలో మోదీ వద్ద చంద్రబాబు వేసిన వేషాలేనని అన్నారు. ‘అదేంటో మోదీతో కాళ్ళబేరానికి వెళ్లినా ఎల్లో మీడియాకు మాత్రం ఆయన యుద్ధం చేస్తున్నట్టు కనిపిస్తోంది’ అని ఎద్దేవా చేశారు.