తిరుపతి ఉప ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించి జగన్ రెడ్డి ప్రోద్బలంతోనే రౌడీ మూకలు రెచ్చిపోయి చంద్రబాబుపై రాళ్లదాడికి పాల్పడ్డారని మాజీ మంత్రి కళా వెంకట్రావు ఆరోపించారు. 

గుంటూరు: వైసీపీ అవలంబిస్తున్న రాజారెడ్డి రాజ్యాంగానికి నిన్నటి చంద్రబాబు సభలో జరిగిన రాళ్లదాడే ప్రత్యక్ష నిదర్శనమని మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు అన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించి జగన్ రెడ్డి ప్రోద్బలంతోనే రౌడీ మూకలు రెచ్చిపోయి చంద్రబాబుపై రాళ్లదాడికి పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్రంలో అప్రజాస్వామిక, విధ్వంస పాలనకు నిన్నటి ఘటన అద్దం పడుతోందన్నారు వెంకట్రావు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

''ప్రజలను మెప్పించి ఓట్లు పొందడం చేతగాక.. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసి పబ్బం గడుపుకోవాలని జగన్ రెడ్డి చూస్తున్నారు. వైసీపీ రెండేళ్ల పాలనలో దాడులు, కక్ష సాధింపు చర్యలు తప్ప అభివృద్ధి శూన్యం. ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు, హత్యలు, భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రజలను, ప్రతిపక్షాలను భయబ్రాంతులకు గురి చేశారు. ఇప్పుడు తిరుపతి ఉపఎన్నికల్లో కూడా భయబ్రాంతులకు గురిచేయాలని కుట్ర పన్నారు'' అని కళా ఆరోపించారు. 

read more నీలాంటి ఫ్యాక్షన్ కుక్కలు చంద్రబాబును భయపెట్టలేవు: జగన్ పై లోకేష్ ఫైర్

''వైసీపీ ఫ్యాక్షనిస్టు విధానాలతో రాష్ట్రం మరో బీహార్ లా మారింది. జడ్ ప్లస్ భద్రత ఉన్న చంద్రబాబుకే రక్షణ లేనప్పుడు ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి? నిందితులను పట్టుకోవడంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. ఎన్ని దాడులు చేసినా తిరుపతిలో వైసీపీకి ఓటమి తప్పదు. తక్షణమే బాధ్యులను అరెస్ట్ చేయాలి. చంద్రబాబు సభలకు తగిన రక్షణ కల్పించాలి'' అని కళా వెంకట్రావు డిమాండ్ చేశారు.