ఏపీ అధికార భాషా సంఘం: అధ్యక్షునిగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పదవీకాలం పెంపు
ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షునిగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పదవీకాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు యార్లగడ్డ పదవీకాలాన్ని మరో రెండు సంవత్సరాలు పొడిగిస్తున్నట్టు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షునిగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పదవీకాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు యార్లగడ్డ పదవీకాలాన్ని మరో రెండు సంవత్సరాలు పొడిగిస్తున్నట్టు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తాజా ఉత్తర్వుల నేపథ్యంలో యార్లగడ్డ 2023 ఆగస్టు 25 వరకు పదవిలో కొనసాగనున్నారు. యార్లగడ్డకు ఏపీ క్యాబినెట్ హోదాతో పాటు మంత్రులకు లభించే జీతభత్యాలు, ఇతర సదుపాయాలు వర్తిస్తాయని రాష్ట్ర పర్యాటక, భాషా సాంస్కృతిక, క్రీడా, యువజన అభ్యుదయ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Also Read:రాజధాని తరలింపులో కీలక ఘట్టం... విశాఖకు అధికార భాషా సంఘం కార్యాలయం: విజయసాయిరెడ్డి
యార్లగడ్డ 2019 ఆగస్టులో ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షునిగా నియమితులయ్యారు. ఆచార్య యార్లగడ్డ కేంద్ర ప్రభుత్వం అందజేసే ప్రతిష్టాత్మక పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాలను అందుకున్నారు. రాజ్యసభ సభ్యులుగానూ పనిచేశారు. తెలుగుతో పాటు హిందీ సాహిత్య రంగాలకు ఆయన చేసిన సేవలు ఎనలేనివి. దక్షిణాదికి చెందిన హిందీ భాషాభిమానిగా అచార్య యార్లగడ్డ గుర్తింపు సాధించారు. 1996-2002 మధ్య కాలంలో రాజ్యసభ సభ్యునిగా ఉన్న సమయంలో పార్లమెంటరీ అధికార భాషా సంఘానికి డిప్యూటీ చైర్మన్గా వ్యవహరించారు. ఆయన స్వస్థలం కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని వానపాముల.