Asianet News TeluguAsianet News Telugu

సీఎం గారూ...అంత:కరణ శుద్దితో అంటే ఇలాగేనా?: నిలదీసిన యనమల

''శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్దతో,అంత:కరణ శుద్దితో నిర్వహిస్తానని, భయంగాని, పక్షపాతంగాని, రాగద్వేషాలుగాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని'' దైవసాక్షిగా చేసిన ప్రమాణం ఏమైంది..? అంటూ సీఎం జగన్ ను టిడిపి నాయకులు యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. 

yanamala ramakrishnudu fires on cm jagan
Author
Guntur, First Published Sep 6, 2020, 12:05 PM IST

గుంటూరు: రైతులకు ఉచిత విద్యుత్ పథకం కొత్తది కాదని...గతంలో వైఎస్సారో ఇప్పుడు జగనో తెచ్చింది కాదని శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 1984నుంచే దీన్ని అమలు చేశారన్నారు. దేశంలో ఆర్ధిక సంస్కరణలు పివి అమలు చేస్తే రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలు తెచ్చింది మాత్రం చంద్రబాబేనని అన్నారు. అలాంటిది జగన్ రెడ్డి విద్యుత్ సంస్కరణలు తెచ్చారని చెప్పడం హాస్యాస్పదంగా వుందన్నారు. 

''వైసిపి ఉచిత విద్యుత్ రైతులకు ఇచ్చే సబ్సిడి కాదు. డిస్కం కంపెనీలకు ఇచ్చేది సబ్సిడీ కాదు. సబ్సిడీ అయితే రైతుల జేబుల్లోకి ఒక్కపైసా వెళ్తుందా..? తన ఖాతా నుంచి ఒక్క పైసా రైతు తీసుకోగలడా..? కార్పోరేషన్ కంపెనీలకు ఇచ్చేది రైతు సబ్సిడి ఎలా అవుతుంది..? అప్పులు పుట్టక తిప్పలు పడుతూ మళ్లీ అప్పుల కోసం రైతుల ప్రాణాలకే ముప్పు తెస్తారా..?'' అని ప్రశ్నించారు. 

''గత ఏడాది డిస్కంల లోటు రూ6,052కోట్లు ఉంటే రూ1250కోట్లు మాత్రమే చెల్లించి, వైసిపి తొలి ఏడాదిలోనే రూ4,802కోట్లు ఎగ్గొట్టారు.  5ఏళ్లలో డిస్కంలకు రూ24వేల కోట్ల నష్టాల్లోకి నెడుతున్నారు. ఈ భారం అంతా పడేది రాబోయే ప్రభుత్వంపై కాదా..? టిడిపి బకాయిలు మీరు తీర్చామని సుద్దులు చెప్పే మీరు తొలి ఏడాదే రూ4,802కోట్లు ఎందుకు ఎగ్గొట్టారు..?'' అని నిలదీశారు. 

read more   14రోజుల నా మనవరాలితో సహా... కుటుంబంలో 11మందికి కరోనా: సీఎంకు టిడిపి ఎమ్మెల్సీ లేఖ

''పెట్టుబడులన్నీ ఇతర రాష్ట్రాలకు తరలిపోయి, నీతి అయోగ్ సన్నద్ధ సూచిలో ఏపి 20వ స్థానానికి దిగజారితే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో నెం 1 వ స్థానం మీ ఘనతగా చెప్పుకోవడం సిగ్గుచేటు. ప్రజాస్వామ్యాన్ని కాలరాయడం, మీడియాను తొక్కేయడం, న్యాయ వ్యవస్థపై నిర్లక్ష్యం, పాలనా వ్యవస్థను స్వప్రయోజనాలకు వాడుకోవడమే జగనిజం. 4మూల స్థంభాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది ప్రజాస్వామ్యం మనుగడకే ప్రమాదం. ప్రజా ప్రయోజనాల కోసమే ప్రజాస్వామ్యం తప్ప, వైసిపి లేదా జగన్ ప్రయోజనాలకో, జగన్ మీడియా లబ్దికో కాదు'' అని అన్నారు. 

''ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వడంలో కూడా జగన్ రెడ్డి ప్రభుత్వం పక్షపాతంతో, స్వార్థంతో వ్యవహరిస్తోంది. వివక్షా విధానాలను అనుసరిస్తోంది. మీడియా రంగంలో తన సొంత ఛానల్, పత్రిక సాక్షి మీడియాదే పైచేయి కావాలనే స్వార్థంతో, ఇతర మీడియా సంస్థలను నిర్వీర్యం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వ ప్రకటనలను తన సాక్షి మీడియాకే ఇస్తున్నారు. ఇలా ఆర్ధిక లాభాలు  చేకూర్చడం ద్వారా తన కుటుంబ ఆకాంక్ష నెరవేరుస్తున్నారు. విచ్చలవిడిగా ప్రభుత్వ ప్రకటనలన్నీ తన కుటుంబ ఛానల్, పత్రికకే ఇచ్చి పెద్దఎత్తున ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారు. రూ 100కోట్లు ఖర్చు పెడితే అందులో రూ 52కోట్లు సాక్షి మీడియాకే ఇవ్వడం జగన్ పక్షపాతానికి నిదర్శనం. సర్కులేషన్ పరంగా 3వ స్థానంలో ఉన్న పత్రికకు కేవలం రూ25లక్షల ప్రకటనలు మాత్రమే ఇవ్వడం వైసిపి ప్రభుత్వ వివక్షకు సాక్ష్యం'' అంటూ మండిపడ్డారు. 

''సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించడమే కాకుండా, రాజ్యాంగాన్ని, దానిపై చేసిన ప్రమాణాన్ని కాలరాయడం హేయం. మోటార్లకు మీటర్లు పెట్టడంపై కూడా మీ సొంత పత్రికలో ఫుల్ పేజి ప్రకటనలు ఇస్తారా..? మీటర్లు పెట్టి రైతుల గొంతు కోస్తూ వాళ్ల డబ్బులతోనే మీ సొంత మీడియాలో ప్రకటనలు గుప్పించడం కిరాతకం కాదా..? పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇచ్చినప్పుడల్లా ప్రకటనలు గుప్పిస్తారా..? పేదల సంక్షేమ పథకాల లబ్దిదారుల్లో భారీగా కోతలు పెడుతూ వాటికి కూడా ప్రభుత్వ ప్రకటనలేనా..? కరోనాలో ఉపాధి కోల్పోయిన ప్రతి పేద కుటుంబానికి రూ 10వేలు ఇవ్వడానికి రాని చేతులు సొంత మీడియాలో కోట్లాది రూపాయల ప్రకటనలు ఇవ్వడం జగన్ రెడ్డి స్వార్ధానికి పరాకాష్ట'' అని విమర్శించారు. 

''సీఎం జగన్ రెడ్డి సొంత కంపెనీ సరస్వతి పవర్ కు రూ1,300కోట్ల విలువైన సున్నపు రాయి గనులను, రైతులకు చెందాల్సిన నీళ్లను కేటాయించుకున్నారు. 25ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ, ప్రభుత్వ భూములు లేవని కేంద్రానికి తప్పుడు సమాచారం ఇచ్చుకున్నారు. 0.036టిఎంసిల నీళ్లకు కేంద్రం అనుమతి ఇస్తే, 0.07టిఎంసిలు కేటాయించుకున్నారు. మొదట 5ఏళ్లకు ఇచ్చి, తర్వాత జీవిత కాలానికి పొడిగించుకున్నారు. సొంత కంపెనీకి రెట్టింపు నీళ్లు కేటాయించుకున్న సీఎంలు గతంలో ఉన్నారా..?కంపెనీలో ప్రభుత్వ భూములు ఉన్నా లేవని మోసం చేసిన సీఎం ఉన్నారా..?సొంత మీడియా సంస్థలకు 66% యాడ్స్ ఇచ్చుకున్న సీఎం దేశంలో ఉన్నారా..? ఇదేనా ప్రజాధనాన్ని కాపాడతానని చేసిన ప్రమాణం..?'' అంటూ సీఎం జగన్ చర్యలను ఎండగట్టారు. 

''నేరం చేయకపోయినా టిడిపి, ఇతర ప్రతిపక్షాల కార్యకర్తలు, నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారు. సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అక్రమ అరెస్ట్ లు చేసి జైళ్లకు పంపుతున్నారు. నేరం చేసినా వైసిపి నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టరు. బిసి,ఎస్సీ,ఎస్టీ మైనారిటిలపై దాడులు చేసినా చర్యలు లేవు. ఇండియన్ పీనల్ కోడ్ (ఐపిసి)ను వైసిపి పీనల్ కోడ్ గా మార్చారు. రాజ్యాంగం పట్ల, చట్టాల పట్ల, న్యాయస్థానాల పట్ల లెక్కలేని తనంతో దుందుడుకుగా వ్యవహరిస్తున్నారు.  
పక్షపాతం, హింసా విధ్వంసాలు, విద్వేషాలకు మనగడ్డపై చోటు లేదు. రాజ్యాంగంలో 3వ షెడ్యూల్, ఆర్టికల్ 164(3) ప్రకారం ముఖ్యమంత్రి, మంత్రులు చేసిన ప్రతిజ్ఞకు, ప్రమాణానికే మచ్చతెచ్చారు'' అని ఆరోపించారు. 

''జర్నలిజం క్వాలిటీని, కోడ్ ను, నిబంధనలను, మార్గదర్శకాలను ఉల్లంఘించారు. ప్రజల గొంతును, ప్రతిపక్షాల స్వరాన్ని నొక్కేసి ప్రజాస్వామ్యానికే కళంకం తెచ్చారు. 'శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్దతో,అంత:కరణ శుద్దితో నిర్వహిస్తానని, భయంగాని, పక్షపాతంగాని, రాగద్వేషాలుగాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని' దైవసాక్షిగా చేసిన ప్రమాణం ఏమైంది..?  
ఇదేనా రాజ్యాంగం పట్ల మీరు చూపే నిజమైన విశ్వాసం, విధేయత..? ఇదేనా మీ కర్తవ్యాన్ని శ్రద్దతో, అంత: కరణ శుద్దితో నిర్వర్తించడం..? పక్షపాతంగాని, రాగద్వేషాలుగాని లేకుండా పనిచేయడం అంటే ఇదేనా..? ఇటువంటి ఫాసిస్ట్ పరిపాలన స్వతంత్ర భారత చరిత్రలో చూడలేదు'' అని మండిపడ్డారు. 

''చరిత్రలో ఫాసిస్ట్ లకు, ఫ్యూడలిస్ట్ లకు చోటులేదు. అంతిమ విజయం ప్రజాస్వామ్యానిదే. దుష్టబుద్దులకు ప్రజలే బుద్ది చెబుతారు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటారు, రాజ్యాంగాన్ని రక్షించుకుంటారు'' అని యనమల పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios