అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. ఓ బాలుడిని అతి కిరాతకంగా నేలకేసి కొట్టి.. బండరాయితో మోది హత్య చేశారు.

అక్రమ సంబంధాల మోజులో పడి మనుషులు మరింత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. బంధాలు, బంధుత్వాలను మరిచిపోయి..క్రూరంగా హత్యలు చేయడానికి కూడా వెనకాడటం లేదు. తాజాగా.. అలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని.. ఓ బాలుడిని అతి కిరాతకంగా నేలకేసి కొట్టి.. బండరాయితో మోది హత్య చేశారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలంలోని మాదినపాడుకు చెందిన లక్ష్మి (బాలుడి తల్లి)కి పదేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన తుపాకుల శ్రీనుతో వివాహం జరిగింది. సాయికల్యాణ్‌ పుట్టిన తర్వాత భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడి విడిపోయారు. అనంతరం లక్ష్మి తన తల్లి కృష్ణవేణి, కుమారుడితో కలిసి వేరే ఇంట్లో అద్దెకు ఉంటూ దాచేపల్లి మండలంలోని కేసనపల్లి గ్రామంలో ప్రకృతి వ్యవసాయశాఖలో ఐసీఆర్పీగా పనిచేసింది. 

ఆ సమయంలో.. అంటే దాదాపు నాలుగేళ్ల క్రితం బుర్రి జానారెడ్డితో లక్ష్మికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. వారిద్దరూ కలిసి మిర్యాలగూడలోని శాంతినగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని ఉన్నారు. బాలుడు మాత్రం తన అమ్మమ్మ కృష్ణవేణి వద్దే ఉంటున్నాడు. తల్లి వద్ద ఉంటున్న కుమారుడిని చూడటానికి తరుచూ లక్ష్మి వెళ్లివస్తుండేది. జానారెడ్డి మాత్రం కుమారుడిని వదిలి తనవద్దే ఉండాలని, లేకుంటే కుమారుడిని చంపుతానని బెదిరించేవాడు.

దీంతో ఆ ఒత్తిడి తట్టుకోలేక తన తల్లి, కుమారుడితో కలిసి యర్రగొండపాలెంలోని తన అక్క వద్ద ఇల్లు అద్దెకు తీసుకుని లక్ష్మి ఉంటోంది. ఐసీఆర్పీ విధులను కూడా వై.పాలేనికి మార్పించుకుంది. కొన్ని రోజుల తర్వాత ఆ విధుల నుంచి కూడా తప్పుకుని హైదరాబాద్, సూర్యాపేటలో చీరలు కొనుగోలు చేసి ఎంబ్రాయిడింగ్‌ చేయించి మిర్యాలగూడలో అమ్ముకుంటూ జీవిస్తోంది. ఈ నేపథ్యంలో మిర్యాలగూడ, యర్రగొండపాలెం ప్రాంతాలకు లక్ష్మి రాకపోకలు సాగిస్తోంది. 

జానారెడ్డి మాత్రం లక్ష్మిని బెదిరిస్తూనే ఉన్నాడు. అతని వద్దకు వెళ్లకుండా వదిలించుకుంటూ వస్తున్న లక్ష్మి.. చివరికి ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో కుమారుడి అడ్డు తొలగిస్తేగానీ, తన వద్దకు రాదని జానారెడ్డి భావించాడు. అతని బంధువైన బ్రహ్మారెడ్డితో కలిసి మోటారు సైకిల్‌పై యర్రగొండపాలెం చేరుకుని 23వ తేదీ రాత్రి 11.30 గంటల సమయంలో అమ్మమ్మతో కలిసి నిద్రిస్తున్న సాయికల్యాణ్‌ను ఎత్తుకెళ్లారు. అనంతరం హత్య చేశారు. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.