వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్న మహిళను ఆమె ప్రియుడే అతి కిరాతకంగా హతమార్చి ఒంటిపై వున్న నగలను దోచుకున్న దుర్ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. 

రాయచోటి: ఈ నెల 11వ తేదీన కడప జిల్లా (kadapa dsitrict) అనుంపల్లి అడవుల్లో చోటుచేసుకున్న మహిళ హత్య మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆమె హత్యకు వివాహేతర సంబంధమే (extramarital affair) కారణంగా తేల్చారు. మృతురాలి ప్రియుడే అతికిరాతకంగా హతమార్చి ఒంటిపై వున్న బంగారాన్ని దోచుకున్నట్లు పోలీసులు నిర్దారించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రాయచోటి (rayachoti murder) పట్టణానికి చెందిన కళావతి(50) రామాపురం మండలం కొండవాండ్లపల్లె గ్రామానికి చెందిన పూదోట గురవయ్య(40)తో వివాహేతర సంబంధాన్ని కలిగివుండేది. అయితే గురవయ్య అవసరాల కోసం బాగా అప్పులు చేసాడు... కానీ ఆ అప్పులు తీర్చడం అతడివల్ల కాలేదు. ఇటీవల అప్పులిచ్చిన వారినుండి ఒత్తిడి పెరగడతో తీవ్ర ఒత్తిడికి గురయిన అతడి కన్ను ప్రియురాలి నగలపై పడింది. 

కళావతి వద్దగల బంగారాన్ని అమ్మేసి ఆ డబ్బులు అప్పులు తీర్చాలని గురవయ్య భావించాడు. అయితే అడిగితే ఆమె ఇవ్వదు కాబట్టి హత్యకు కుట్ర పన్నాడు. ఇందులో భాగంగానే ఈనెల (మార్చి) 11వ తేదీన పనుంది బయటకు వెళదామని చెప్పి కళావతిని శిబ్యాల సమీపంలోని అనుంపల్లి అడవుల్లోకి తీసుకెళ్లాడు. అడవిలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి తనవెంట తెచ్చుకున్న కత్తితో ప్రియురాలి గొంతు కోసాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై గిలగిలా కొట్టుకుంటూ కళావతి మరణించింది.

ఆమె చనిపోయినట్లు నిర్దారించుకున్న గురవయ్య ఆమె ఒంటిపై వున్న బంగారు ఆభరణాలను తీసుకున్నారు. అనంతరం ఆమె మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించి అక్కడినుండి వెళ్లిపోయాడు. అయితే కళావతి శవం పూర్తిగా కాలిపోలేదు. పాక్షికంగా కాలిన మృతదేహాన్న అడవిలో గుర్తించినవారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఘటనా స్థలంలో ఆధారాలను సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. 

వివిధ ఆధారాల సాయంతో మృతురాలి వివరాలను తెలుసుకున్న పోలీసులు ఆమెతో గురవయ్య సన్నిహితంగా వుండేవాడని గుర్తించాడు. అతడు పరారీలో వుండటంతో పోలీసుల అనుమానం మరింత పెరిగింది. దీంతో అతడి కోసం గాలిస్తుండగా శనివారం గున్నికుంట్ల రోడ్డు కూడలిలో సంచరిస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. అతడిని తమదైన రీతిలో విచారించగా హత్య చేసినట్లు అంగీకరించాడు. హత్యకు ఉపయోగించిన కత్తితో పాటు దోచుకున్న బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు గురవయ్యను కోర్టులో హాజరుపర్చి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.