పెళ్లింట్లో విషాదం: భర్త చూస్తుండగానే భార్య మృతి
శ్రీకాకుళం జిల్లాలో పెళ్లింట విషాద సంఘటన చోటు చేసుకుంది. పెళ్లి కార్డులు పంచుతూ ఊళ్లు తిరుగుతూ వస్తున్న దంపతులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. భర్త కళ్లెదుటే భార్య ప్రాణాలు కోల్పోయింది.
శ్రీకాకుళం: వివాహం జరగాల్సిన ఇంట్లో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఆ ఇంట్లో మరో వారం రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. ఇంతలోనే భర్త చూస్తుండగానే భార్య మృత్యువాత పడింది. ఈ ఘటన శ్రీకాకళం జిల్లాలోని సంతకవిటి - రాజాం ప్రధాన రహదారి గొల్లసీతారాంపురం వద్ద శనివారం జరిగింది.
ఆ ఘటనలో సంతకవిటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిహెచ్ఓగా పనిచేస్తున్న కె. సరోజినీ (58) మరణించగా, భర్త ప్రదీప్ కొద్దిపాటి గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు.
రాజాం పట్టణం మారుతీనగర్ లో ప్రదీప్ కుటుంబం నివాస ఉంటోంది. సరోజినీ పిహెచ్ సీలో పనిచేస్తోంది. ఆమె భర్త ప్రదీప్ హౌస్ంగ్ ఏఈగా పనిచేస్తున్నాడు. వారి కూతురికి మరో వారం రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. దీంతో వివాహం కార్డులను పంచేందుకు వారు ద్విచక్రవాహనంపై బొడ్డూరు, సంతకవిటి తదితర గ్రామాలకు వెల్లి తిరిగి వస్తున్నారు.
గొల్లసీతారాంపురం మలుపు వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో వారి వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. దాంతో తీవ్రంగా గాయపడిన సరోజిని అక్కడికక్కడే మరణించింది. ప్రదీప్ గాయపడ్డాడు. మృతురాలి సోదరుడు కే. శ్రీనివాస రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ట
సరోజినికి కుమారుడు ఉండవల్లి చక్రవర్తి, కూతురు శ్రావణి ఉన్నారు. సరోజిని ఏడాది క్రితం విజయనగరం నుంచి సంతకవిటి పిహెచ్ సీకి బదిలీపై వచ్చారు.