బ్లాక్ ఫంగస్ బాధితురాలి ఆత్మహత్య..!
మే 4న ఆమె కరోనా మహమ్మారి బారిన పడింది. ఆమెకు కరోనా సోకగా.. అదే నెల 13వ తేదీన ఆమెకు నెగిటివ్ రిపోర్టు కూడా వచ్చింది.
కరోనా నుంచి కోలుకున్న ఓ మహిళ బ్లాక్ ఫంగస్ బారిన పడింది. కాగా.. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయిన సదరు బాధితురాలు బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
నెల్లూరు జిల్లాకు చెందిన కమతం జయమ్మ(60) అదే నగరంలోని ఓ ఆస్పత్రిలో స్టాఫ్ నర్స్ గా విధులు నిర్వహించింది. మే 4న ఆమె కరోనా మహమ్మారి బారిన పడింది. ఆమెకు కరోనా సోకగా.. అదే నెల 13వ తేదీన ఆమెకు నెగిటివ్ రిపోర్టు కూడా వచ్చింది.
ఈ క్రమంలో బ్లాక్ ఫంగస్ లక్షణాలు బయటపడటంతో గత 26న స్విమ్స్ కోవిడ్ ఆస్పత్రిలోని ప్రత్యేక ఈఎన్టీ వార్డులో చేర్చారు. ఈ నెల 10న బాధితురాలికి శస్త్ర చికిత్స చేశారు. అయినప్పటికీ ఆమె ఆరోగ్యం కుదుటపడలేదు. దీంతో.. బాధితురాలు తీవ్ర మనస్థాపానికి గురైంది.
దీంతో ఆదివారం ఉదయం వార్డులోని స్నానాల గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు.