బద్దకిస్తున్న ఓటర్లూ... వీళ్ళను చూసాకయినా కదలండి... ఓటేయండి..!!
ప్రజాస్వామ్య స్పూర్తికి నిలువెత్తు నిదర్శనం ఈ గిరిపుత్రులు. ఓటుహక్కను వినియోగించుకునేందుకు వీళ్లు ఎంత కష్టపడుతున్నారో చూడండి... వీళ్లు కదా అసలు ఓటర్లంటే...
![Woman carried in doli to cast vote in Andhra Pradesh Assembly Elections 2024 AKP Woman carried in doli to cast vote in Andhra Pradesh Assembly Elections 2024 AKP](https://static-ai.asianetnews.com/images/01hxr7cpwg9w71hyc1gh2nwjy4/screenshot--312--png_363x203xt.jpg)
అమరావతి : తెలుగు రాష్ట్రాల ఓటర్లలో చైతన్యం కనిపిస్తోంది. ప్రజాస్వామ్య దేశంలో పాలకులను ఎన్నుకొనే బాధ్యత ప్రజలదే... కానీ కొందరు తమ బాధ్యతను మరిచిపోతున్నారు. ఇలా ఓటు వేయడానికి బద్దకిస్తున్నవారిలో విద్యావంతులే అధికంగా వుంటున్నారన్నది అందరికీ తెలిసిందే. నగరాలు, పట్టణాల్లో కంటే నిరక్ష్యరాస్యులు అధికంగా వుండే గ్రామాల్లోనే పోలింగ్ శాతం అత్యధికంగా నమోదవుతుంటుంది. మారుమూల గ్రామాల ప్రజలు ఓటుహక్కును ఎంత విలువైనదిగా భావిస్తున్నారో తెలియజేసే సంఘటన ఆంధ్ర ప్రదేశ్ లో వెలుగుచూసింది.
ఇంటిపక్కనే పోలింగ్ బూత్ వున్నా ఓటేసేందుకు కొందరు కదలడం లేదు. కానీ 15 కిలోమీటర్లు పిల్లా పాపలతో కలిసి కాలినడకన ప్రయాణిస్తూ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన ఓ గిరిజనులు. ఇక నడవలేని స్థితిలో వున్న వృద్దులను సైతం డోలీపై మోస్తూ కొండలు, గుట్టలు దాటించి పోలింగ్ కేంద్రానికి తరలిస్తున్నారు. ఇలా ఓ వృద్ధురాలిని ఓటేయడానికి తరలిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఇదికదా ప్రజాస్వామ్య స్పూర్తి ... ఈ గిరిజన బిడ్డలు కదా ఓటర్లంటే.. అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. వీరిని చూసైనా ఓటు వేసేందుకు జనాలు ముందుకు రావాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇక ఆంధ్ర ప్రదేశ్ లోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద వృద్దులు, వికలాంగులు ఓటేస్తున్నారు. నడవలేని స్థితిలో కూడా కుటుంబసభ్యుల సాయంతో ఓటేసేందుకు వస్తున్నారు. ఇలా వృద్దులను, వికలాంగులను కొందరు యువకులు ఎత్తుకుని పోలింగ్ బూత్ లోకి వెళుతున్న దృశ్యాలు దర్శనమిస్తున్నాయి.