ఉరేసుకుని భార్య అనుమానాస్పద మృతి.. నిద్రమాత్రలు మింగి భర్త ఆత్మహత్యాయత్నం.. ట్విస్ట్ ఏంటంటే...
ఆంధ్రప్రదేశ్ లో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో ఉరేసుకుని మరణించింది. ఈ సమయంలో ఆమె భర్త స్లీపింగ్ పిల్స్ మింగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
యానాం : ఆంధ్రప్రదేశ్లోని యానాంలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె భర్త నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. యానాం పట్టణంలోని మెట్టుకూరు గ్రామంలో స్థానిక సాయి కాలనీలో ఉంటున్న దంగేటి లక్ష్మీ భవాని (20) అనే వివాహిత మహిళ ఫ్యాన్ కు ఉరేసుకుని బుధవారం ఉదయం ఆత్మహత్య చేసుకుంది. అంతకుముందు మంగళవారం ఆమె భర్త ఆర్ఎంపీ డాక్టర్ అయిన దంగేటి వరప్రసాద్ నిద్రమాత్రలు మింగాడు. దీంతో అతడిని స్థానిక జీజీహెచ్ లో చేర్చారు. అక్కడ అతడికి చికిత్స అందిస్తున్నారు.
ఈ మేరకు పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. గోకవరం మండలం కొత్తపల్లికి చెందిన లక్ష్మీ భవానికి, యానాం మెట్టకూరు సాయి కాలనీకి చెందిన దంగేటి వరప్రసాద్ ను ఇచ్చి మూడేళ్ల క్రితం పెద్దలు పెళ్లి జరిపించారు. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. ఆ చిన్నారికి రెండు సంవత్సరాలు. కాగా, భార్యాభర్తల మధ్య గతకొద్దికాలంగా మనస్పర్థలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే లక్ష్మీ భవాని ఆత్మహత్య చేసుకోవడం అనుమానాస్పదంగా మారింది. లక్ష్మీ భవానీ మృతదేహాన్ని యానాంలోని జీజీహెచ్ కు తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. ఈ మేరకు ఎస్సై బడుగు కనకారావు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
అయితే లక్ష్మీ భవాని తల్లి అరుణ తన కూతురు ఆత్మహత్య చేసుకోలేదని…ఆమెను హత్య చేసి.. ఆ తరువాత ఫ్యాన్ కు వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించింది. తన అల్లుడు వరప్రసాద్ తండ్రి సూర్యనారాయణ, తల్లి బేబీలే తన కూతురు మృతికి కారణమని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక తన అల్లుడు ఆర్ఎంపీ డాక్టర్ వరప్రసాద్.. నిద్ర మాత్రలు మింగినట్లు చెబుతూ.. తన మీద అనుమానం రాకుండా నటిస్తున్నాడని ఆరోపించింది.
లక్ష్మీ భవానిని అత్తింటివారు గత కొద్ది రోజులుగా వేధిస్తున్నారని.. రోజూ తను కొడుతున్నారని లక్ష్మిభవాని ఫోన్లో తనతో చెప్పిందని తల్లి చెప్పుకొచ్చింది. అయితే, సంసారంలో కొన్నిసార్లు ఇలాంటివి మామూలేనని.. సర్దుబాటు అవుతుందని అనుకున్నామని చెప్పింది. భార్య భర్తల మధ్య గొడవలు ముదరడంతో ఇటీవల పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టించమని.. ఇరువర్గాలకు వారు నచ్చజెప్పడంతో మూడు నెలల క్రితమే యానాంకు వచ్చిందని తల్లి చెప్పుకొచ్చింది. అంతకుముందు గొడవల కారణంగా అత్తగారింటి నుంచి వచ్చి గోకవరం మండలం కొత్తపల్లిలో తనతో పాటు కొంతకాలం ఉందని ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. నిందితులను అరెస్టు చేసి తన కుమార్తెకు న్యాయం చేయాలని కోరింది.