నిద్రలోనే భర్తను కడతేర్చిన భార్య, ఎందుకు?
మద్యానికి బానిసై ప్రతి రోజూ గొడవ పడుతున్న భర్తను ఓ భార్య పరలోకానికి పంపించింది.
గుంటూరు: మద్యానికి బానిసై ప్రతి రోజూ గొడవ పడుతున్న భర్తను ఓ భార్య పరలోకానికి పంపించింది. నిద్రలోనే అతన్ని హతమార్చింది. ఈ సంఘటన గుంటూరు జిల్లా కంతేరు గ్రామలో బుధవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది.
వాకా వెంకటేశ్వర్లు(45) గ్రామంలో తాపీ పనిచేస్తూ వస్తున్నాడు. రాత్రుళ్లు తాగి వచ్చిన భార్య లక్ష్మితో గొడవ పడుతుండేవాడు. వారికి కూతుళ్లున్ననారు. కూతుళ్లకు పెళ్లిళ్లు కూడా అయిపోయాయి.
మంగళవారం రాత్రి కూడా రోజు మాదిరిగానే తాగి ఇంటికి వచ్చాడు. భార్యతో గొడవకు దిగాడు. అతని తండ్రి, తమ్ముడు జోక్యం చేసుకొని, అప్పటికి చల్లబరిచారు. ఆ తర్వాత వెంకటేశ్వర్లు ఇంటి బయట పడుకొన్నాడు. అతడు మంచి నిద్రలో ఉండగా లక్ష్మి పచ్చడిబండతో భర్త తలపై బలంగాకొట్టింది.
వెంకటేశ్వర్లు పెద్దగా కేకలుపెట్టడంతో ఇరుగుపొరుగువారు పరుగెత్తుకుని వచ్చారు. అప్పటికే రక్తపు మడుగులో కాసేపు తన్నుకొని వెంకటేశ్వర్లు చనిపోయాడు. పరారీలో ఉన్న లక్ష్మి కోసం పోలీసులు గాలిస్తున్నారు.