ఏపిపై మోడి పగబట్టారా?
ప్రత్యేక ప్యాకేజిని తానసలు ప్రకటించలేదని ఒకసారి, కేంద్రమంత్రే ప్రకటించిన తర్వాత ప్రత్యేకించి చట్టబద్దత అవసరం లేదని మరోసారి కమలనాధులు చెబుతున్నారు. అది కేంద్రం ఏపికి ఇస్తున్న ప్రత్యేక ప్రాధాన్యత.
ప్రధాని నరేంద్రమోడి ఏపిపై ఎందుకో పగ పట్టినట్లే కనబడుతోంది. పగ రాష్ట్రంపైనా లేక చంద్రబాబునాయుడుపైనా అన్నది అర్ధం కావటం లేదు. ఏదేమైనా గడచిన రెండున్నరేళ్లుగా రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్రం ఏమాత్రం సానుకూలంగా లేదని మాత్రం చెప్పవచ్చు. అయితే, రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటి వరకూ వచ్చిందంతా కేవలం విభజన హామీలే తప్ప ఇంకేమీ కాదు. విభజన హామీలను పీస్ మీల్ లెక్కలో మంజూరు చేస్తున్న కేంద్రం ఏపికేదో పెద్దగా ఒరగబెట్టేస్తోందన్నట్లు బిల్డప్ మాత్రం ఇస్తోంది.
ఇక, ప్రస్తుత విషయానికి వస్తే, ప్రత్యేక ప్యాకేజికి చట్టబద్దత ఇచ్చే విషయాన్ని మోడి పక్కన బెట్టేసారు. ఈరోజు జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో టెబుల్ ఐటెమ్ గా ప్రత్యేకప్యాకేజి అంశం వచ్చిందట. అయితే, ఈ విషయమై చర్చించేందుకు తనకు సమయం లేదని కాబట్టి పక్కన బెట్టేయమని మోడి చెప్పారట. అయితే, ఇక్కడ ఓ సందేహం వస్తోంది. ఏపికి ప్రత్యేక ప్యాకేజి లాంటి కీలకమైన అంశాన్ని అరుణ్ జైట్లీ టేబుల్ ఐటెమ్ గా తీసుకురావటం ఏమిటి? ప్రధాన అజెండాలోనే చేర్చి వుండవచ్చుకదా? టేబుల్ ఐటమ్ అంటేనే ఆ అంశానికి కేంద్రం ఎంత ప్రాధాన్యత ఇస్తోందో అర్ధం అవుతోంది.
అయితే, భాజపా నేతల వాదన ఇంకోలా వుంది. ఏపికి కేంద్రం ఎన్నడూ ప్రత్యేకప్యాకేజి ప్రకటించలేదని చెబుతున్నారు. జైట్లీ ప్రకటించింది కేవలం ‘ప్రత్యేకసాయం’ మాత్రమే. కేంద్రం ప్రకటించని ప్రత్యేక ప్యాకేజిని పట్టుకుని చంద్రబాబు చట్టబద్దత కావాలంటూ డిమాండ్ చేయటంలో అర్ధం లేదంటున్నారు కమలనాధులు. రాజ్యసభలో మన్మోహన్ సింగ్ ప్రకటించిన ప్రత్యేకహోదా గాలికిపోయింది. ఎన్నికల్లో స్వయంగా మోడి, వెంకయ్య, చంద్రబాబులు ప్రకటించిన ప్రత్యేకహోదాకు దిక్కులేదు. తాజాగా ప్రత్యేక ప్యాకేజిని తానసలు ప్రకటించనలేదని ఒకసారి, కేంద్రమంత్రే ప్రకటించిన తర్వాత ప్రత్యేకించి చట్టబద్దత అవసరం లేదని మరోసారి కమలనాధులు చెబుతున్నారు. అది కేంద్రం ఏపికి ఇస్తున్న ప్రత్యేక ప్రాధాన్యత.