భాజపా ప్రచారంతో టిడిపి నష్టపోయినా పర్వాలేదా?
- నంద్యాల ఉపఎన్నికలో తాము కూడా టిడిపి అభ్యర్ధికి ప్రచారం చేస్తామని భాజపా శనివారం చేసిన ప్రకటనతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
- ఎందుకంటే, ఉపఎన్నిక అనివార్యమని తేలిపోయిన దగ్గర నుండి నియోజకవర్గంలో టిడిపి మాత్రమే ప్రచారం చేసుకుంటోంది.
- నియోజకవర్గంలో అంతో ఇంతో బలమున్న భాజపాను చంద్రబాబు ప్రచారానికి దూరం పెట్టేసారన్నది వాస్తవం.
- నంద్యాలలో ఓ అభ్యర్ధి గెలుపోటముల్లో మైనారిటీల ఓట్లు చాలా కీలకం.
మిత్రపక్షాల మధ్య ఏం జరుగుతోంది? నంద్యాల ఉపఎన్నిక కేంద్రంగా టిడిపి-భారతీయ జనతా పార్టీల మధ్య విచిత్రమైన నాటకం మొదలైంది. నంద్యాల ఉపఎన్నికలో తాము కూడా టిడిపి అభ్యర్ధికి ప్రచారం చేస్తామని భాజపా శనివారం చేసిన ప్రకటనతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే, ఉపఎన్నిక అనివార్యమని తేలిపోయిన దగ్గర నుండి నియోజకవర్గంలో టిడిపి మాత్రమే ప్రచారం చేసుకుంటోంది. ఇప్పటికి రెండు నెలల నుండి టిడిపి ఒంటరి పోరాటమే చేస్తోంది.
నంద్యాలలో గెలవటం టిడిపికి అంత ఈజీ అయితే కాదు. అటువంటి సమయంలో ఏ పార్టీ అయినా ఏం చేస్తుంది? అందుబాటులో ఉన్న అన్నీ అవకాశాలనూ అందిపుచ్చుకుని గెలుపుకోసం ప్రయత్నిస్తుంది. మరోవైపు ప్రతిపక్ష వైసీపీ టిడిపిని ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది. మరి, ఇటువంటి పరిస్ధితులో నియోజకవర్గంలో కూడా అంతో ఇంతో బలమున్న భాజపాను చంద్రబాబు ప్రచారానికి దూరం పెట్టేసారన్నది వాస్తవం. ఎందుకని?
ఎందుకంటే, నియోజకవర్గంలో మైనారిటీల ఓట్ల కోసమే భాజపాను చంద్రబాబు దూరం పెట్టేసారు. నంద్యాలలో ఓ అభ్యర్ధి గెలుపోటముల్లో మైనారిటీల ఓట్లు చాలా కీలకం. మొత్తం 2.3 లక్షల ఓట్లలో మైనారిటీల ఓట్లు సుమారుగా 60 వేలు. భాజపాతో కలిసి ప్రచారం చేస్తే మైనారిటీ ఓట్లు ఎక్కడ దూరమవుతాయో అన్న భయంతోనే ఇంతకాలం వాళ్లని దూరంగానే ఉంచారన్నది బహిరంగ రహస్యం. ఈ విషయం భాజపా నేతలకు కూడా బాగా తెలుసు.
కాబట్టే, ‘అంతా మనమంచికే అనుకుని’ భాజపా కూడా టిడిపి అభ్యర్ధి ప్రచారానికి దూరంగా ఉండిపోయింది. అటువంటిది టిడిపి అభ్యర్ధి కోసం తాము కూడా ప్రచారం చేయాలని భాజపా నేతలు హటాత్తుగా నిర్ణయించటమేంటి? ఈరోజు జరిగిన పదాదికారుల సమావేశంలో భాజపా ఈ నిర్ణయం తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. చంద్రబాబు లెక్కప్రకారం భాజపా ప్రచారానికి వస్తే టిడిపి నష్టపోతుంది కదా? టిడిపి నష్టపోతుందని తెలిసీ భాజపా నేతలు ప్రచారం చేయాలని నిర్ణయించారంటే అర్ధమేంటి? అసలు రెండుపార్టీల మధ్య తెర వెనుక ఏం జరుగుతోందబ్బా?