బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి: వారసుల మధ్య రాజీకి 14 మఠాధిపతుల రాక, అనుమతి లేదన్న పోలీసులు
బ్రహ్మంగారిమఠానికి సంబంధించి వారసుల మధ్య చోటు చేసుకొన్న వివాదాలను పరిష్కరించేందుకు పలు పీఠాధిపతులు ప్రయత్నాలు ప్రారంభించారు. బుధవారం నాడు బ్రహ్మంగారి పీఠాన్ని సందర్శించేందుకు వెళ్తున్న పలువురు పీఠాధిపతులను పోలీసులు అడ్డుకొన్నారు.
కడప: బ్రహ్మంగారిమఠానికి సంబంధించి వారసుల మధ్య చోటు చేసుకొన్న వివాదాలను పరిష్కరించేందుకు పలు పీఠాధిపతులు ప్రయత్నాలు ప్రారంభించారు. బుధవారం నాడు బ్రహ్మంగారి పీఠాన్ని సందర్శించేందుకు వెళ్తున్న పలువురు పీఠాధిపతులను పోలీసులు అడ్డుకొన్నారు.
బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి విషయంలో వారసుల మధ్య చిచ్చు రగిలింది. వారసత్వ వివాదం సాగుతున్న నేపథ్యంలో ఈ మఠాన్ని సందర్శించేందుకు ఎవరికీ అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు ఆలయ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. ఆలయంలోకి ఎవరిని అనుమతించమని తేల్చి చెప్పారు. రాష్ట్రంలోని 14 పీఠాధిపతులు ఇవాళ బ్రహ్మంగారి మఠానికి చేరుకొన్నారు. బ్రహ్మంగారి శిష్యులతో పాటు వారసులతో చర్చించి ఏకాభిప్రాయం తీసుకొస్తామని పీఠాధిపతులు చెబుతున్నారు.
బ్రహ్మంగారి మఠం ఏడో తరానికి చెందిన పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి ఇటీవల కాలంలో అనారోగ్యంతో మరణించాడు. నూతన పీఠాధిపతి ఎంపిక విషయంలో కుటుంబసభ్యుల మధ్య గొడవలు సాగుతున్నాయి. ఇటీవలే మరణించిన వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామికి ఇద్దరు భార్యలు. పెద్ద భార్యకు నలుగు కొడుకులు, నలుగురు కూతుళ్లు, రెండో భార్యకు ఇద్దరు కొడుకులున్నారు.
పీఠాధిపతి పదవి తనకే కావాలని పెద్ద భార్య చంద్రావతమ్మ కొడుకు కోరుతున్నాడు. ఈ పదవిని తన కొడుకుకు ఇవ్వాలని వసంత వెంకటేశ్వరస్వామి వీలునామా రాశాడని రెండో భార్య మహాలక్ష్మమ్మ చెబుతోంది. కందిమల్లాయపల్లె గ్రామస్తులు మాత్రం పెద్ద భార్య మొదటి కొడుకుకు పీఠాధిపతి పదవి ఇవ్వాలని కోరుతున్నారు. ఈ విషయమై విచారణకు దేవాదాయశాఖ ఉన్నతాధికారులు వెళ్లారు. విచారణ సమయంలో కూడ ఇరు వర్గాలు తమకే ఇవ్వాలని పట్టుబట్టడంతో అధికారులు విచారణను మధ్యలోనే నిలిపివేసి వెళ్లిపోయారు.