'వాగ్దానాలను విస్మరిస్తే ప్రజలకు ఎవరు భరోసా కల్పిస్తారు': రాజధాని పిటిషన్లపై తుది విచారణ
రాజ్యం తన వాగ్దానాన్ని విస్మరిస్తే ప్రజలకు ఎవరు భరోసా కల్పిస్తారని రైతుల తరపు న్యాయవాది ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
అమరావతి: రాజ్యం తన వాగ్దానాన్ని విస్మరిస్తే ప్రజలకు ఎవరు భరోసా కల్పిస్తారని రైతుల తరపు న్యాయవాది ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
అమరావతి రాజధానికి సంబంధించి దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో రోజువారీ తుది విచారణ మంగళవారం నాడు జరిగింది.
ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
శాసనమండలిలో చర్చ లేకుండా..,సెలెక్ట్ కమిటీ రిపోర్టు ఇవ్వకుండా తెచ్చిన అభివృద్ధి వికేంద్రీకరణ చట్టం చెల్లదని సుప్రీంకోర్టు న్యాయవాది బండారు ఆదినారాయణ రైతుల తరపున వాదించారు. ద్విసభ విధానం అమలులో ఉన్న ఏపీలో శాసనమండలి అభిప్రాయాలు వమ్ముచేసి తెచ్చిన రెండు చట్టాలు చెల్లవని ఆయన హైకోర్టుకు తెలిపారు.
రాష్ట్ర విభజన సమయంలో రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాదును కేంద్రం నిర్దేశించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు అమరావతి విషయంలో తమకు సంబంధం లేదని కేంద్రం చెప్పడం సరికాదన్నారు.
ల్యాండ్ పూలింగ్ ద్వారా రాజధాని అభివృద్దికి ప్రజల నుంచి ఇంతపెద్ద ఎత్తున భూ సమీకరణ చేసిన దాఖలాలు దేశంలో ఎక్కడా లేవని ధర్మాసనానికి తెలిపారు.ల్యాండ్ పూలింగ్ లోపాలు, ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగి ఉంటే.., వాటిమీద చర్యలు తీసుకోవాలన్నారు.
కోట్లు వెచ్చించి నిర్మాణాలు చేపట్టిన తర్వాత రాజధాని మార్పు సబబు కాదన్నారు. ఒకవైపు రాష్ట్రానికి ఆర్థిక వెసులుబాటు లేదంటూనే మూడు రాజధానులకు నిధులు ఎక్కడి నుంచి సమీకరిస్తారన్నారని రైతుల తరపు న్యాయవాది ప్రశ్నించారు.
సీఆర్డీఏ చట్టంలో లోపాలున్నాయని రద్దుచేసి రైతులకు ఇచ్చిన భరోసాను వమ్ము చేశారన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా విధానాలు సంపూర్ణంగా మారితే భవిష్యత్కు భరోసా ఉండదని రైతుల తరపున వాదనలు వినిపించారు.