వైజాగ్ లో మూడేళ్లుగా ముసుగులో మగ్గుతున్న ఎన్టీ రామారావు
ఈ ముసుగులో ఉన్న వ్యక్తి తెలుగుదేశం పార్టీ సంస్థాపకుడు, పలుమార్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. చంద్రబాబునాయుడికి స్ఫూర్తి అయిన ఎన్టీ రామారావు. 2014లో అధికారంలోకి వచ్చాక, చంద్ర బాబునాయుడు కనీసం పదిహేను సార్లయినా విశాఖ వచ్చి ఉంటారు. ఒక గంట సమయం కేటాయిస్తే, ముసుగు తొలగిపోతుంది. అయినా అలా జరగలేదు. మూడేళ్లుగా ముసుగులో ఎన్టీఆర్ ఇలా మగ్గిపోతూ ఉన్నారు.
విశాఖ పట్టణం న్యూ కాలనీ వెళ్లే రోడ్డులో ఈ ముసుగు విగ్రహం కనిపిస్తుంది. "ఊపిరాడడంలేదు, ఉక్కపెడతా ఉంది, ఈ ముసుగుతీసేసి కాపాడండర్రా" అంటూ దీనంగా దారినపోయే వాళ్లను వేడుకుంటున్నట్లు అనిపిస్తుంది. ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆ దారిలో మంత్రులు వెళ్లారు, ఎమ్మెల్యేలు వెళ్లి ఉంటారు. ఉన్నతాధికారులు వెళ్లి ఉంటారు. నాయకులు వెళ్లి ఉంటారు. అయినా ఆయన ముసుగు లాగేసి ఆ పెద్ద మనిషికి వూపిరాడేలా చేయడం లేదొక్కరు కూడా.
ఈ ముసుగులో ఈ వ్యక్తి ఇలా ఉండబట్టి నెల కాదు, రెన్నెళ్లు, కాదు, మూడేండ్ల యింది. అయినా ముసుగు తొలగిపోలేదు.
సరే, ఇంతకీ ఈ ముసుగులో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసు కదా, తెలుగుదేశం పార్టీ సంస్థాపకుడు, పలుమార్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, చంద్రబాబునాయుడికి స్ఫూర్తి అయిన ఎన్టీ రామారావు. ఆయన సరే ఈ ముసుగు తొలగించుకోలేకపోతున్నారు.
2014లో అధికారంలోకి వచ్చాక, చంద్ర బాబునాయుడు కనీసం పదిహేను సార్లయినా విశాఖ వచ్చి ఉంటారు. ఒక గంట సమయం కేటాయిస్తే, ముసుగు తొలగిపోతుంది. అయినా అలా జరగలేదు.
ఎందుకీ నిర్లక్ష్యం ?
ఈ విగ్రహాన్ని టిడిపి నాయకుడు ఎం. వెంకటరావు దాదాపు పదిలక్షలు ఖర్చు పెట్టి తయారుచేయించారు. అక్కడ నిలబెట్టించారు. అయితే, ఆవిష్కరణ జరగడం లేదు. కారణం, ఈ విగ్రహం అపుడు అనధికారికంగా పెట్టారు. దీనికి వైజాగ్ మునిసిపల్ కార్పొరేషన్ వారి అనుమతి రావాలి. దానికి రు. 2 లక్షలు చెల్లించాలి. ఎవరు చెల్లించాలి? అందరూ తప్పకుని తిరిగారు. ఫలితంగా అన్నగారిలా దిక్కులేక పడిఉన్నారు.
పొద్దున లేస్తూనే తెలుగుదేశంనేతలు ఎన్టీయార్ పేరే చెబుతుంటారు. తెలుగుదేశం అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శులు వగైరాలు ఎన్టీఆర్ కు అందరు చూసేలా చక్కటి నమస్కారం చేయకుండా ఏపని చేపట్టరు. అమరావతిలో భారీ ఎన్టీర్ విగ్రహం పెడతానని, అది కూడా బాబాసాహేబ్ అంబేద్కర్ కు ఎదరుగా ఉంటుందని రెండు రోజుల కిందట ముఖ్యమంత్రి బాబు ప్రకటించారు.
మాటలు అలా కోటలు దాటుతూ ఉంటే, వైజాగ్ లో ఎన్టీఆర్ ఇలా ముసుగులో ఇరుక్కుపోయి గిజగిజ లాడుతున్నారు.
వైజాగ్ మహానాడు సందర్భంగా నైనా ఈ ముసుగు తొలగి పోకుండా ఉంటుందా అని వైజాగ్ వాసులు చోద్యం చూసేందుకు రెడీ అవుతున్నారు. కాని, టిడిపి నుంచి ఇంతవరకు ఈ ముసుగు తొలగింపు గురించి వివరణ రావడం లేదు.రెండు లక్షల రుపాయలు ఎవరు చెల్లించాలనే పట్టింపుతో, ఆయన పేరు చెప్పి మంత్రులయినోళ్లు, ఎమ్మెల్యేలయినోళ్లు ఇలా తప్పించుకు తిరుగుతున్నారంటే, ఏమనాలి?