త్యాగాలు అంతా చేయలేరు, కొందరే త్యాగ రాజులు, వాళ్ల త్యాగమేమిటో వాళ్లు చెబితే తప్ప మనకు తెలియదు 

 రాజకీయాల్లోకి వచ్చి తనేంత కోల్పోయింది ముఖ్యమంత్రి చంద్రబా బు నాయుడు కర్నూలు ప్రజల ముందుంచాడు. తన కొచ్చిన కష్టం మరెవరికి రాలేదని అంటూసభకు వచ్చిన వాళ్లంతా అదృష్ట వంతులన్నాడు.

 శనివారం నాడు చంద్రబాబునాయుడు కర్నూలుపట్టణంలో అనేక కార్యక్రమాలలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జనచైతన్యం యాత్రలోనూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తను రాష్ట్రం కోసం పడుతున్న కష్టాలను ఎల్లబోసుకున్నారు.

“మీలో చాలా మంది భార్య పిల్లలతో ఇంట్లో చాలాసేపు గడుపుతారు. నాకా అదృష్టం లేదు” అని అన్నారు. అలా అంటున్నపుడు ఆయన ముఖమ్మీద బాధ ఏ మాత్రమూ కన్పించకుండా జాగ్రత పడ్డట్టున్నారు.

“ భార్యాపిల్లలతో కొంత సమయం కూడా గడపలేకపోతున్నాను. ఎపుడూ రాష్ట్రం గురించే ఆలోచిస్తుంటాను. ఫలితంగా వారితో గడపలేకపోయాను. ఆ రోజుల్లో, మా అబ్బాయి చదువుకునే రోజుల్లో కూడా, వాడితో గడప లేకపోయాను. కాకపోతే, ఫామిలి గురించి భాద్యతాయుతంగా ఉన్నాను కాబట్టి ఫామిలీ అవసరాల కోసం హెరిటేజ్ సంస్థను ఏర్పాటుచేశాను. అందులో ఎవరి డబ్బులు లేవు. ఒక్కపైసా ఎవరి నుంచి తీసుకోలేదు. దూరదృష్టితో ఈ సంస్థప్రారంభించాను. ఇపుడు దీనికి ఎన్నో అవార్డులు వస్తున్నాయి,” అని చెప్పారు.

 అంతేకాదు, తను పార్టీ కోసం ఎంతకష్టపడింది కూడా చెప్పారు. “ఎన్టీ ఆర్ బతికున్న పుడు రోజూ తెల్లవారుజామున నాలుగు గంటలకే వెళ్లే వాడిని. ఆయన నిద్ర లేచే సరికి వెళ్లేవాడిని. మళ్లీ ఆయన నిద్రపోయాకే ఇంటికొచ్చేవాడిని,” ముఖ్యమంత్రి చెప్పారు.

ముఖ్యమంత్రి త్యాగం గురించి చాలా మంది ప్రశంసిస్తున్న సంగతి తెలిసిందే.అవన్నీ ఒక ఎత్తు. అనంతపురం తెలుగుదేశం లోక్ సభ సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి చేసిన ప్రశంస మరీ ఎత్తు.

దివాకర్ రెడ్డి వ్యాఖ్యను చాలా మంది వ్యంగ్యాస్త్రంగా తీసుకుంటారు గాని, అది తన హృదయం నుంచి వచ్చిందని ఆయనే చెప్పారు. దివాకర్ రెడ్డి ఏమన్నారంటే, “ మొదటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి నుంచి చంద్రబాబు నాయుడి దాకా ముఖ్యమంతులందరినిచూశాను. ఒక్క పివి నరసింహారావుగారితో అనే నాకంత పరిచయంలేదు. వాళ్లెవరు కూడా చంద్రబాబు నాయుడిలాగా మనవడితో కూడ గడపనంతగా రాష్ట్రం కోసం కష్ట పడి ఉండరు. ఎవరికైనా ఒక కోరిక ఉంటుంది. మనవడి తో గడపాలని. కాని మన ముఖ్యమంత్రి ఆ కోరికను కూడా తీర్చుకోలేకపోతున్నారు,” అని ముఖ్యమంత్రి త్యాగాన్ని కొనియాడారు.