వికేంద్రీకరణే తమ  విధానమని  ఏపీ రాష్ట్ర ప్రభుత్వ  సలహాదారు  సజ్జల రామకృష్ణారెడ్డి  చెప్పారు. మూడు  రాజధానులకు  మద్దతుగా డిసెంబర్  5న  భారీ  సభను నిర్వహిస్తున్నామని  ఆయన తెలిపారు.   

అమరావతి:మూడు  రాజధానులకు  మద్దతుగా డిసెంబర్  5న  భారీ సభను నిర్వహిస్తున్నట్టుగా ఏపీ రాష్ట్ర  ప్రభుత్వ  సలహదారు  సజ్జల రామకృష్ణారెడ్డి  చెప్పారు. సోమవారంనాడు  అమరావతిలో  ఏపీ రాష్ట్ర ప్రభుత్వ  సలహాదారు  సజ్జల రామకృష్ణారెడ్డి  మీడియాతో  మాట్లాడారు.మూడు  రాజధానులపై  ప్రభుత్వం  తీసుకున్న  నిర్ణయం సహజ న్యాయానికి  అనుగుణంగా  ఉందన్నారు. ఆ తర్వాత  జరిగిన పరిణామాల్లో  ఏపీ  హైకోర్టు  మూడు  రాజధానులకు  భిన్నంగా  ఆదేశాలు ఇచ్చిన  విషయాన్ని ఆయన గుర్తు  చేశారు. అయితే  ఇవాళ  మాత్రం  సుప్రీంకోర్టు  కీలక  ఆదేశాలు  జారీ  చేసిందన్నారు.

గతంలో  ఏపీ  హైకోర్టు  ఇచ్చిన  ఆదేశాలపై సుప్రీంకోర్టు  స్టే ఇచ్చిందని  తెలిపారు.ప్రభుత్వాల  తప్పొప్పులను  నిర్ణయించాల్సింది  ప్రజలేనన్నారు. జగన్  తీసుకున్న నిర్ణయాల  కారణంగానే  ప్రజలు  అన్ని  ఎన్నికల్లో   ఏకపక్ష విజయం  అందించారని ఆయన  గుర్తు  చేశారు.  ఒక  రాజధాని అమరావతి  ఉండాలని టీడీపీ  విధానానికి  ప్రజలు ఆమోదం  తెలపలేదన్నారు. అందుకే  మంగళగిరిలో  పోటీ చేసిన  లోకేష్  ఓటమి పాలైనట్టుగా  ఆయన  గుర్తు  చేశారు. చంద్రబాబు రియల్  ఏస్టేట్  కోసమే  రాజధానిని ఏర్పాటు చేశారన్నారు. అందుకే ప్రజలు తిరస్కరించారని  ఆయన  అభిప్రాయపడ్డారు. 

సీమలో  న్యాయ రాజధాని  కోసం గొంతు  బలంగా  విన్పించాలన్నారు.వికేంద్రీకరణే తమ  విధానమని  ఆయన చెప్పారు.గ్రామస్థాయిలో  వికేంద్రీకరణ  మొదలైందన్నారు.  పరిపాలనా వికేంద్రీకరణలో  భాగంగానే  26  జిల్లాలను  ఏర్పాటు  చేసినట్టుగా  ఆయన  గుర్తు  చేశారు. గతంలో  కేంద్రీకృత  అభివృద్దితో  నష్టం జరిగిందని  సజ్జల  రామకృష్ణారెడ్డి  చెప్పారు.గతంలో  పచ్చని పొలాలు  36వేల  ఎకరాలను సేకరించినట్టుగా  ఆయన  తెలిపారు.. 

also read:అమరావతిపై కేసులో ఏపీ ప్రభుత్వానికి ఊరట.. హైకోర్టు తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు..

అమరావతి రాజధాని  విషయంలో  ఏపీ  హైకోర్టుపై  సుప్రీంకోర్టు  ఆగ్రహం వ్యక్తం  చేసిన అంశంపై  తాను  ఎలాంటి  వ్యాఖ్యలు  చేయబోనని  ఆయన తెలిపారు. వచ్చే  ఎన్నికల్లో  వైసీపీని  అధికారంలోకి ఎలా వస్తోందో చూస్తానన్న  పవన్  కళ్యాణ్  వ్యాఖ్యలపై  కూడా ఆయన  స్పందించారు. గతంలో  కూడా  ఆయన  ఇదే  తరహలోనే  వ్యాఖ్యలు  చేశారన్నారు.