లోకేష్ పాదయాత్ర లో  అస్వస్థతకు గురైన  సినీ నటుడు తారకరత్నకు  వైద్యులు  చికిత్స అందిస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం బెంగుళూరుకు తరలించే అవకాశం లేకపోలేదు. 

హైదరాబాద్: ఆసుపత్రికి తీసుకువచ్చే సమయానికి సినీ నటుడు తారకరత్నకు పల్స్ లేదని ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. వైద్యులు చేసిన చికిత్స తర్వాత తారకరత్నకు పల్స్ ప్రారంభమైందని ఆసుపత్రివర్గాలు చెబుతున్నాయి. లోకేష్ పాదయాత్ర సమయంలో తారకరత్న సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే టీడీపీ కార్యకర్తలు ఆయనను కుప్పంలోని కేసీ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఆసుపత్రికి తారకరత్నను చేర్పించే సమయానికి తారకరత్నకు పల్స్ లేనట్టుగా వైద్యులు చెబుతున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

తారకరత్నకు ట్రీట్ మెంట్ చేసి పల్స్ ను పునరుద్దరించారు. ఆసుపత్రికి తీసుకువచ్చే సమయానికి తారకరత్న శరీరం నీలిరంగులోకి మారిపోయిందని వైద్య సిబ్బంది చెబుతున్నారు. 45 నిమిషాల తర్వాత తారకరత్న పల్స్ ను పునరుద్దరించారు. ప్రాథమిక చికిత్స తర్వాత కుప్పంలోని పీఈఎస్ ఆసుపత్రికి తారకరత్నను తరలించారు. ఈసీజీ, ఎకో పరీక్షలు కూడా తారకరత్నకు నిర్వహించారు.

తారకరత్నకు ఆసుపత్రిలో వైద్య చికిత్స నిర్వహిస్తున్న సమయంలోనే బాలకృష్ణ ఆసుపత్రికి చేరుకున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి బాలకృష్ణ వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇంకా మెరుగైన వైద్య చికిత్స కోసం అవసరమైతే బెంగుళూరుకు తరలించే అవకాశం లేకపోలేదు.తారకరత్నకు కార్డియాక్ అరెస్ట్ అయినట్టుగా భావిస్తున్నారు. తారకరత్నకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 

నారా లోకేష్ యువగళం పేరుతో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి తారకరత్న వచ్చారు. తారకరత్న నందమూరి మోహనక్రిష్ణ కుమారుడు. తారకత్నకు యాంజియోగ్రామ్ చేస్తున్నారు.ఆసుపత్రికి వచ్చిన వెంటనే ట్రీట్ మెంట్ మొదలు పెట్టినట్టుగా వైద్యులు చెబుతున్నారు.

also read:లోకేష్ పాదయాత్రలో సొమ్మసిల్లి పడిపోయిన తారకరత్న: ఆరోగ్యం సీరియస్

రాజకీయాల్లో చురుకుగా పాల్గొనాలని తారకరత్న భావిస్తున్నారని చెబుతున్నారు. ఈ కారణంగానే ఇవాళ కుప్పంలో నారా లోకేష్ పాదయాత్రకు తారకరత్న వచ్చారు. లోకేష్ తో పాటు కలిసి తారకరత్న 15 నిమిషాల పాటు పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్ర సమయంలోనే తారకరత్న అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు.