లోకేష్ పాదయాత్రలో సొమ్మసిల్లి పడిపోయిన తారకరత్న: ఆరోగ్యం సీరియస్
సినీనటుడు నందమూరి తారకరత్నకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుప్పంలో జరుగుతున్న నారా లోకేష్ యువగళ: పాదయాత్రలో పాల్గొన్న ఆయనకు మైనర్ కార్డియాక్ అరెస్ట్ గా చెబుతున్నారు.
కుప్పం : కుప్పంలో ఈరోజు ఉదయం ప్రారంభమైన టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో అపశృతి చోటుచేసుకుంది. సినీ నటుడి నందమూరి తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు. ఈరోజు ఉదయం 11గంటలకు కుప్పం సమీపంలోని లక్ష్మీపురం శ్రీ వరదరాజస్వామి ఆలయంలో నారా లోకేష్ ప్రత్యేక పూజలు చేసిన తర్వాత పాదయాత్ర ప్రారంభించారు. నారా లోకేష్ తో పాటు పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. అయితే పాదయాత్ర ప్రారంభమైన గంట గంటన్నర తర్వాత.. ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు.
పాదయాత్రలో కొద్ది దూరం నడిచిన తర్వాత దగ్గర్లోని మసీదులో లోకేష్ ప్రార్థనలు చేశారు. కాక ఈ సమయంలో లోకేష్ తో పాటు తారకరత్న కూడా మసీదులోకి వెళ్లారు మసీదు నుంచి బయటికి వచ్చే సమయంలో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున రావడంతో ఆతాకిడికి రత్న సొమ్మసిల్లి పడిపోయి తీవ్ర అస్వస్థతకు గురయ్యారని సమాచారం. వెంటనే స్థానిక టిడిపి నేతలు ఆయనను కుప్పంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
ఆయనకు కార్డియాక్ అరెస్ట్ అని అనుమానంతో ప్రథమ చికిత్సలో భాగంగా సీపీఆర్ చేశారు. హార్ట్ బీట్ వచ్చిందని చెబుతున్నారు. కార్డియాలజిస్ట్ కు హ్యాండోవర్ చేశారు. ఆ తరువాత కుప్పం మెడికల్ కాలేజీకి తరలించారు. ఐసీయూలో ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. టీడీపీ నేత, నటుడు బాలకృష్ణ ఆస్పత్రికి చేరుకుని పరిశీలిస్తున్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా ఆస్పత్రికి చేరుకుంటున్నారు. మెరుగైన వైద్యంకోసం బెంగళూరుకు తరలించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.