జగన్ ఇచ్చినమాట నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాం
ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వైసీపీ అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చారని ఆ హామీని నిలబెట్టుకుంటారని తాము ఆశిస్తున్నట్లు తెలిపారు. సీఎం జగన్ తమను సమ్మె వరకు వెళ్లనివ్వరని అనుకుంటున్నట్లు తెలిపారు
అమరావతి: ఏపీఎస్ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. జూన్ 13 నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ యూనియన్ సంఘాలు స్పష్టం చేశాయి. అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. విజయవాడ లోని జేఏసీ కార్యాలయంలో గోడపత్రికను విడుదల చేశారు.
ఆర్టీసీ పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవాలని తమ సమస్యలను పరిష్కరించాలని లేనిపక్షంలో సమ్మెకు వెళ్తామని ఇప్పటికే ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చినట్లు యూనియన్ నేతలు స్పష్టం చేశారు. ప్రజారవాణ ప్రజారంగంలోనే కొనసాగాలని కోరారు.
జూన్ 12 నుంచి దూర ప్రాంత సర్వీసులను నిలిపివేస్తామని స్పష్టం చేశారు. పాదయాత్రలో ఆర్టీసీని ప్రభుత్వంలో ఇస్తామని ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారని ఆమాట మీద జగన్ నిలబడతారాని స్పష్టం చేశారు.
ప్రజలకు గానీ, ప్రభుత్వానికి గానీ నష్టం చేకూర్చాలన్నది తమ లక్ష్యం కాదన్నారు. కానీ ఆర్టీసీ యాజమాన్యం మాత్రం తాము సమ్మెలోకి వెళ్లేలా చేసిందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ దామోదర్ స్ఫష్టం చేశారు.
ఆర్టీసీలో ఉద్యోగుల కుదింపు, తమకు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని లేనిపక్షంలో తాము సమ్మెకు దిగడం తప్పదని చెప్పుకొచ్చారు. తాము నూతన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నామని స్పష్టం చేశారు.
వైయస్ జగన్మోహన్ రెడ్డి తమకు న్యాయం చేస్తామని ఆశిస్తున్నామని తెలిపారు. చర్చలకు ఆహ్వానిస్తే తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తమ డిమాండ్ల పట్ల సానుకూలంగా ప్రభుత్వ నిర్ణయం తీసుకోకుంటే తాము నిరసనకు దిగుతామని హెచ్చరించారు.
ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వైసీపీ అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చారని ఆ హామీని నిలబెట్టుకుంటారని తాము ఆశిస్తున్నట్లు తెలిపారు.
సీఎం జగన్ తమను సమ్మె వరకు వెళ్లనివ్వరని అనుకుంటున్నట్లు తెలిపారు. ఏదిఏమైనప్పటికీ సమ్మెకు సిద్ధమవుతున్నామని జూన్ 3 నుంచి సన్నాహక కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ దామోదర్ స్పష్టం చేశారు.