భువనేశ్వరిని మేం అగౌరవపర్చలేదు- వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
భువనేశ్వరిని వైసీపీ ఎమ్మెల్యేలు కించపరిచేలా మాట్లాడలేదని ఆ పార్టీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. తమ తప్పు లేకపోయినా ఆ తల్లికి క్షమాపణలు చెబుతాన్నామని మీడియా సమావేశంలో చెప్పారు.
ఎన్టీఆర్ కూతురు, చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని తాము ఏమీ అనలేదని వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. కావాలనే రాజకీయ ప్రయోజనాల కోసమే టీడీపీ అధినేత చంద్రబాబు నాయడు ఆమెను ఇందులోకి లాగుతున్నారని అన్నారు. భువనేశ్వరిని అగౌరవ పరిచేలా వైసీపీ వ్యాఖ్యలు చేసిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన స్పందిచారు. మీడియాతో ఈ అంశంపై శివప్రసాద్ రెడ్డి మాట్లాడారు. అగౌరవంగా మాట్లాడింది వల్లభనేని వంశీ అని చెప్పారు. ఆయన వైసీపీకి చెందిన వ్యక్తి కాడని స్పష్టం చేశారు. వంశీ మాటాలు నిజంగా బాధ కలిగించాయని అన్నారు. ఇందులో తమ తప్పు ఏం లేకపోయినా భువనేశ్వరీ దేవిని క్షమాపణలు కోరుతున్నామని అన్నారు.
కావాలనే ఆ తల్లిని ఇందులోకి లాగుతున్నారు.
వైసీపీని ఈ అంశంలోకి కావాలనే లాగుతున్నారని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఏవరో అన్న మాటలను వైసీపీకి ఆపాదించడం సరైంది కాదని అన్నారు. చంద్రబాబు నాయుడు తన స్వార్థ ప్రయోజనాల కోసం భువనేశ్వరిని ఇందులోకి లాగుతున్నారని అన్నారు. ‘గౌరవసభ’ ఏర్పాటు చేసి ఆయన భార్యనే అవమానానికి గురి చేసేలా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. మహిళలపై తనకు గౌరవం ఉందని అన్నారు. తమ కుటుంభ సభ్యుల్లోనూ మహిళలు ఉన్నారని చెప్పారు. భువనశ్వరిని తాము ఎప్పుడూ రాజకీయ కోణంలో చూడలేదని, ఒక తల్లిగా చూశామని తెలిపారు. శాసన సభలో వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరూ కూడా భువనేశ్వరీ దేవి వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా, అసభ్యకరమైన పదజాలాన్ని వాడలేదని అందరికీ తెలుసని అన్నారు. ఈ విషయంలో కావాలనే మీడియా రాద్ధాంతం చేస్తుందని అన్నారు. తాము అసెంబ్లీలో ఒక వేళ అలా మాట్లాడి ఉంటే.. దానికి సంబంధించిన వీడియో, ఆడియో క్లిప్లను చంద్రబాబుకు అనుకూలంగా ఉన్న మీడియా ఇప్పటికే బయటపెట్టి ఉండేవని తెలిపారు. అలా జరుగలేదు అంటే తాము చేయలేదనే విషయం స్పష్టమవుతుందని అన్నారు. వల్లభనేని వంశీ తప్పు చేశారని, ఈ విషయంలో ఆయన ఇప్పటికే క్షమాపణలు కోరారని తెలిపారు. చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటే తమ ఎమ్మెల్యేలందరితో కలిసి వెళ్లి భువనేశ్వరి పాదాలు కడుగుదామని చెప్పారు. గాయం చేసిన వ్యక్తి వల్లభనేని వంశీ అని చెప్పారు. ఆ గాయాన్ని మాన్చడానికి తాము ప్రయత్నిస్తే, చంద్రబాబు నాయుడు, ఆయన అనుకూల మీడియా, టీడీపీ నాయకులు ఆ గాయాన్ని మరింత పెద్దది చేయడానికి చూస్తున్నారని ఆరోపించారు. ఆ గాయాన్ని పుండు చేసే విధంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు వెళ్లి గౌరవసభలు ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు. ఈ విషయానికి ఎక్కడో ఒక చోట ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో తమ సభ్యులు తప్పు చేయనప్పటికీ తాను క్షమాపణలు కోరుతున్నాని అన్నారు. ఇకనైన ఈ విషయంలో టీడీపీ రాజకీయాలు మానుకోవాలని సూచించారు.