కేసీఆర్ ఎఫెక్ట్: చిత్తూరులో వైసీపీ, టీఆర్ఎస్ నేతల ఫోటోలతో వాచీలు
తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించిన తర్వాత ఏపీలో కొందరు వైసీపీ నేతలు సంబరాలు చేసుకొన్నారు
చిత్తూరు: తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించిన తర్వాత ఏపీలో కొందరు వైసీపీ నేతలు సంబరాలు చేసుకొన్నారు. అయితే చిత్తూరు జిల్లాకు చెందిన కొందరు వైసీపీ నేతలు పంచినట్టుగా చెబుతున్న గడియారాల్లో వైసీపీ నేతలతో పాటు టీఆర్ఎస్ నేతల ఫోటోలు కూడ ఉండడం రాజకీయంగా చర్చకు దారి తీస్తోంది.
చిత్తూరు జిల్లాలోని మదనపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ నేతల ఫోటోలతో గడియారాలు పంచినట్టుగా ప్రచారం సాగుతోంది. ఈ గడియారాల్లో వైసీపీ నేతల ఫోటోలు ఉన్నాయి. ఎంపీ మిథున్రెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యే తిప్పారెడ్డి ఫోటోలు ఉన్నాయి.
ఫోటో అడుగున కవర్ తీస్తే కవర్ తీసి చూస్తే టీఆర్ఎస్ నేతల ఫోటోలు ఉన్నాయి. కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు ఉండడం రాజకీయంగా చర్చకు దారి తీస్తోంది. తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజునే ఏపీ సీఎం చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు.
తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ విజయం సాధించడంతో ఏపీలో వైసీపీ నేతలు సంబరాలు చేసుకొన్నారు. వైసీపీకి టీఆర్ఎస్ మద్దతుగా నిలుస్తోందని చంద్రబాబునాయుడు పదే పదే ఆరోపణలు చేశారు. మరో వైపు వైసీపీ నేతలు తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతిచ్చారని కూడ బాబు ఆరోపించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ గడియారాల పంపిణీ రాజకీయంగా చర్చకు దారి తీసింది.