బాలుడిని డాబా మీదినుంచి తోసేసిన వాలంటీర్.. కాలు, చెయ్యి విరిగి..తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరి...
వాలంటీర్ ఓ దారుణానికి పాల్పడ్డారు. పదకొండేళ్ల బాలుడిని డాబా మీదినుంచి తోసేశాడు. దీంతో బాలుడి కాలు,చేయి విరిగింది.
తూర్పుగోదావరి జిల్లా : ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలో ఓ గ్రామ వాలంటీర్ ఘాతకానికి పాల్పడ్డాడు. తాను సిగరెట్లు తీసుకురమ్మంటే తీసుకురాలేదని ఓ బాలుడిపై దాడి చేశాడు. డాబా పైనుంచి బాలుడిని తోసేశాడు. దీంతో బాలుడి కాలు, చేయి విరిగాయి. తీవ్ర గాయాలతో మంచాన పడ్డాడు. జిల్లాలోని కోరుకొండ మండలంలో ఈ ఘటన జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
దీనికి సంబంధించి బాలుడి తల్లిదండ్రులు, పోలీసులు ఇలా వివరాలు తెలిపారు. కళ్యాణం సతీష్ (23) అని వ్యక్తి కణపూర్ గ్రామానికి చెందినవాడు. అతను గ్రామ వాలంటీర్ గా పనిచేస్తున్నాడు. బాధితుడి పేరు తల్లోజు శశిధర్(12). ఏడో తరగతి చదువుకుంటున్నాడు. ఆగస్టు 11వ తేదీన శశిధర్ రోడ్డుమీద వెడుతుంటే సతీష్ ఆపాడు. తనకు సిగరెట్లు తీసుకురావాలని కోరాడు. అయితే శశిధర్ సతీష్ చెప్పింది వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు.
నంద్యాల : ఆఫీస్లోనే అయ్యవారి రాసలీలలు.. ముద్దులు, హగ్గులతో రెచ్చిపోయిన మున్సిపల్ ఉద్యోగి
ఇది సతీష్ మనసులో పెట్టుకున్నాడు. ఆ రోజు రాత్రి ఊర్లో బుర్రకథ జరిగింది. అక్కడ శశిధర్, మరో విద్యార్థి సతీష్ కి కనిపించారు, సతీష్ వారిద్దరిని సరదాగా తిరుగుదాం రమ్మంటూ టూ వీలర్ మీద ఎక్కించుకున్నాడు. ఊళ్లో ఉన్న సామిల్లు దగ్గరికి తీసుకువెళ్లాడు. ముగ్గురు కలిసి డాబా మీదకి వెళ్లారు. అప్పటికే అక్కడ బజ్జీలు, మద్యం సీసాలున్నాయి. అక్కడికి వెళ్లిన తర్వాత నేనెవరో తెలుసా? సిగరెట్లు తెమ్మంటే తేవా? అంటూ సతీష్ శశిధర్ ని చావబాదాడు.
ఇది చూసి భయపడిన మరో బాలుడు కొట్టొద్దంటూ ప్రాధేయపడ్డాడు. దీంతో ఆ బాలుడుని కూడా కొట్టాడు. అతని దాడి నుంచి ఎలాగో తప్పించుకుని కిందికి దిగి వెడుతుండగా.. వెనకనుంచి సతీష్ శశిధర్ ని గట్టిగా తన్నాడు. ఆ ఫోర్స్ కు శశిధర్ అదుపుతప్పి డాబా మీద నుంచి రోడ్డుపై పడ్డాడు. సతీష్ వారిద్దరిని ఇక్కడ జరిగిన విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. ఆ తర్వాత వారిద్దరిని తన టూ వీలర్ మీదనే ఎక్కించుకొని ఇంటి దగ్గర దింపేశాడు.
శశిధర్ కు గాయాలవడం చూసి తల్లిదండ్రులు ఏమైందని అడగగా కుడిమెట్లు ఎక్కుతుంటే జారిపడ్డాడని తీసుకొచ్చాను అని చెప్పాడు. బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో తల్లిదండ్రులు తెల్లవారి రాజమహేంద్రవరంలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే అక్కడ చికిత్స అందించిన గాయాలు నయం కాకపోవడంతో మరో ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది.
బాలుడు తను మెట్ల మీద నుంచి జారి పడలేదని సతీష్ తనను తోసేసాడు అని తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో బాలుడు తల్లి లక్ష్మి గురువారం రాత్రి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసింది. తమకు న్యాయం చేయమంటూ వేడుకుంది. శశిధర్ కి రెండు కాళ్ళకి, కుడి చేతికి తీవ్ర గాయాలు అయ్యాయని చెప్పింది. ఓ కాలికి చేతికి ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది.
తన కొడుకు ఆరు నెలల పాటు మంచంలో నుండి లేవనేని పరిస్థితుల్లో ఉన్నాడని.. కన్నీరు మున్నీరయింది. దీని మీద ట్రైనీ ఐపీఎస్ అధికారి పంకాజ్ కుమార్ మీనా స్పందించారు. శుక్రవారం ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సిబ్బంది ద్వారా సేకరించారు. అయితే ఈ ఘటనకు పాల్పడిన వాలంటీర్ జులాయి అని..గంజాయి, మద్యం తాగుతుంటాడని తెలిసింది.
తన కొడుకును ఇష్టం వచ్చినట్లు చిత్రహింసలు పెట్టాడని.. కొట్టాడని ఆ తల్లి చెప్పుకొచ్చింది. వాలంటీర్ అంతకుముందు కూడా గ్రామంలో పలువురిని బెదిరించిన సంఘటనలు ఉన్నాయి. బాలుడిని తోసేసిన ఘటన వెలుగు చూడడంతో నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ దారుణానికి పాల్పడిన వాలంటీరు సాధ్యం అరెస్టు చేసినట్లు ఎస్ఐ కట్టా శారదా సతీష్ తెలిపారు.