విశాఖపట్టణం  స్టీల్ ప్లాంట్  ఆడ్మిన్ భవనం ముందు  కార్మిక సంఘాలు  ఆందోళనకు దిగాయి.  వేతన ఒప్పందాన్ని అమలు  చేయాలనిడ కార్మిక సంఘాలు డిమాండ్  చేశాయి. 

విశాఖపట్టణం: వేతన  సవరణ  ఒప్పందం అమలు  చేయాలనే  డిమాండ్ తో  కార్మిక సంఘాలు  మంగళవారంనాడు  స్టీల్ ప్లాంట్   ఆడ్మిన్ భవనాన్ని  ముట్టడించాయి ఆడ్మిన్ భవనం ముందున్న రోడ్డుపై కార్మికులు బైఠాయించారు.   వేతన సవరణ ఒప్పందం  అమలు చేయకపోతే  తమ జీవితాలు  రోడ్డున పడుతాయని   కార్మికులు  ఆవేదన వ్యక్తం  చేశారు.  దాదాపు రెండు గంటలకు  పైగా  రోడ్డుపై  బైఠాయించి  కార్మికులు ఆందోళనలు నిర్వహిస్తున్న నేపథ్యంలో  వాహనదారులు  ఇబ్బందులు పడ్డారు.  
రోడ్డుపై బైఠాయించిన  కార్మికులను  పంపేందుకు  పోలీసులు  ప్రయత్నించారు. అయితే పోలీసులకు,  కార్మికులకు మధ్య  తోపులాట చోటు  చేసుకుంది. దీంతో ఉద్రిక్తత నెలకొంది. 

విశాఖ స్టీల్  ప్లాంట్ ను  ప్రైవేటీకరించాలని  కేంద్రం నిర్ణయం తీసుకుంది.   విశాఖ స్టీల్ ప్లాంట్   ప్రైవేటీకరణను నిరసిస్తూ  కార్మిక సంఘాలు కూడా ఆందోళనకు  దిగాయి. విశాఖ స్టీల్ ప్లాంట్  కు అవసరమైన ఇనుప ఖనిజం కేటాయిస్తే  స్టీల్ ప్లాంట్  లాభాల బాటలోకి వెళ్లనుందని  కాంగ్రెస్ కార్మిక సంఘాలు చెబుతున్నాయి.  అయితే  విశాఖ స్టీల్ ప్లాంట్ ను  పూర్తి స్థాయిలో  నడిపేందుకు గాను  ఇటీవల  ఈఓఐకి  విశాఖ స్టీల్ ప్లాంట్  యాజమాన్యం టెండర్లు  పిలిచింది.