విశాఖ ఎమ్మార్వో హత్యకేసులో ట్విస్ట్ ... నిందితుడు ఫ్లైటెక్కి పరారయ్యాడట... (వీడియో)
ఎమ్మార్వో రమణయ్యను హతమార్చిన దుండుగుడు నేరుగా విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నాడని... ప్లైట్ ఎక్కి పరారయ్యాడని పోలీస్ కమీషనర్ రవిశంకర్ తెలిపారు.
విశాఖపట్నం : రెవెన్యూ అధికారి దారుణ హత్య ఆంధ్ర ప్రదేశ్ లో సంచలనం సృష్టించింది. ఓ మండల రెవెన్యూ అధికారి(ఎమ్మార్వో)ని ఆయన నివాసం వద్దే అత్యంత దారుణంగా కొట్టిచంపాడు దుండగుడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఎమ్మార్వో హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించాడు. విశాఖపట్నంలో చోటుచేసుకున్న ఈ ఎమ్మార్వో హత్యకేసును పోలీసులు చేధించారు. భూముల వ్యవహారమే తహసీల్దార్ హత్యకు దారితీసినట్లు విశాఖ పోలీస్ కమీషనర్ రవిశంకర్ అయ్యనార్ తెలిపారు.
విశాఖ రూరల్ పరిధిలోని చినగదిలిలో తహసీల్దార్ గా సనపల రమణయ్య పనిచేసారు. రెండ్రోజుల క్రితమే ఆయన బదిలీ అయ్యారు. అయితే గత శుక్రవారం రాత్రి విశాఖ శివారు కొమ్మాదిలో ఆయన నివాసముండే అపార్ట్ మెంట్ బయటే దారుణ హత్యకు గురయ్యాడు. మాస్క్ ధరించి వచ్చిన ఓ వ్యక్తి రమణయ్య రాడ్ తో విచక్షణారహితంగా కొట్టిచంపాడు. ఈ హత్య దృశ్యాలు అపార్ట్ మెంట్ సిసి కెమెరాల్లో రికార్డు కావడంతో నిందితుడిని వెంటనే గుర్తించారు పోలీసులు.
తహసీల్దార్ రమణయ్య హత్యను చాలా సీరియస్ గా తీసుకున్నామని... వెంటనే ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి నిందితుడి కోసం గాలింపు చేపట్టినట్లు విశాఖ సిపి రవిశంకర్ తెలిపారు. భూముల వ్యవహారమే ఎమ్మార్వో హత్యకు కారణమని... చంపింది ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి అని గుర్తించామని సిపి అన్నారు. రమణయ్యపై దాడి తర్వాత నిందితుడు నేరుగా విమానాశ్రయానికి చేరుకున్నాడని... విమానమెక్కి పరారయినట్లు సిపి తెలిపారు. దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యలో నిందితుడి వివరాలు తెలియజేయడం లేదని... అతడి పట్టుకున్న తర్వాత పూర్తి వివరాలు తెలియజేయనున్నట్లు సిపి రవిశంకర్ పేర్కొన్నారు.
Also Read విశాఖలో తహసీల్దార్ దారుణహత్య.. ఇంట్లోకి దూరి, ఇనుపరాడ్లతో దాడి చేసి...
గతంలో నిందితుడు రమణయ్య పనిచేసే ఎమ్మార్వో కార్యాలయానికి పలుమార్లు వెళ్లినట్లు తమ దర్యాప్తులో తేలిందని సిపి అన్నారు. అయితే అతడు ఏ పనిపై వెళ్లాడు? ఎందుకు ఎమ్మార్వో రమణయ్యను హత్య చేసేంత కక్ష పెంచుకున్నాడు? ఈ హత్యకు దారితీసిన భూవ్యవహారం ఏమిటి? అనేది తేలియాల్సి వుందన్నారు. నిందితుడు పట్టుబడితే హత్యకు గల కారణమేంటో తెలుస్తుందన్నారు. ఇప్పటికయితే రియల్ ఎస్టేట్ వ్యాపారమే తహసీల్దార్ హత్యకు కారణంగా ప్రాథమికంగా అనుమానిస్తున్నట్లు పోలీస్ కమీషనర్ తెలిపారు.
వీడియో
అసలేం జరిగింది :
ఎమ్మార్వో రమణయ్య కుటుంబంతో కలిసి విశాఖ శివారులోకి కొమ్మాదిలో నివాసం వుంటున్నాడు. చరణ్ క్యాస్టల్ అపార్ట్ మెంట్ లోని ఓ ప్లాట్ లో వుంటున్న అతడు గత శుక్రవారం రాత్రి సమయంలో బయటకు వచ్చాడు. అయితే అప్పటికే అతడికోసం కాపుకాసిన ఓ వ్యక్తి రాడ్ తీసుకుని రమణయ్య వద్దకు వెళ్లాడు. ఇద్దరి మధ్య ఏదో వాగ్వాదం జరగ్గా ఒక్కసారిగా దుండగుడు రమణయ్యపై రాడ్ తో దాడి చేసాడు. విచక్షణారహితంగా కొట్టడంతో రమణయ్య అక్కడే రక్తపుమడుగులో పడిపోగా దుండుగుడు పరారయ్యాడు.
అపార్ట్ మెంట్ వాచ్ మెన్ ఈ దాడిని గమనించి రమణయ్య కుటుంబసభ్యులకు తెలిపాడు. వెంటనే వారు కొనఊపిరితో వున్న అతడిని దగ్గర్లోని అపోలో హాస్పిటల్ కు తరలించారు. కానీ అప్పటికే అతడి పరిస్థితి పూర్తిగా విషమించడంతో మృతిచెందాడు.