ఫిరాయింపులకు బంపర్ ఆఫర్: జగన్ సంచలన నిర్ణయం
- విజయసాయి మీడియాతో మాట్లాడుతూ, తమ పార్టీలో నుండి టిడిపిలోకి వెళ్ళిన ఎంఎల్ఏల్లో కొందరు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెప్పారు.
ఫిరాయింపులకు వైసిపి బంపర్ ఆఫర్ ప్రకటించింది. వైసిపిని వీడి టిడిపిలోకి వెళ్లిన తమ ఎంఎల్ఏల్లో కొందరిని వెనక్కు తీసుకుంటామని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన ప్రకటన సంచలనంగా మారింది. విజయసాయి మీడియాతో మాట్లాడుతూ, తమ పార్టీలో నుండి టిడిపిలోకి వెళ్ళిన ఎంఎల్ఏల్లో కొందరు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెప్పారు. ఫిరాయింపుల్లో పలువురు టిడిపిలోకి దూకినందుకు బాధపడుతున్నట్లు అక్కడక్కడ చెబుతూనే ఉన్నారు. పలువురికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు దక్కేది కూడా అనుమానమే.
అదే సమయంలో టిడిపిలో ఫిరాయింపుల్లో చాలామందికి తీవ్ర అవమానాలు ఎదురవుతున్నాయి. పార్టీలో అవమానాలు ఒక ఎత్తైతే జనాలు నానా రకాలుగా వారిని అవమానిస్తున్నారు. భవిష్యత్తుపై ఆందోళనతోనే పలువురు ఫిరాయింపులు తాము తిరిగి వైసిపిలోకి చేరుదామనుకుంటున్నట్లు జనగ్ కు కబురు పంపుతున్నారు. వారి పరిస్ధితిని అర్దం చేసుకున్న జగన్ కూడా ఆమధ్య సానుకూలంగా స్పందించారు. అదే విషయాన్ని విజయసాయి కూడా ప్రస్తావించారు.
ఫిరాయింపుల వరకూ ఓకే గానీ టిడిపి ఎంఎల్ఏలను మాత్రం చేర్చుకునేది లేదన్నారు. ఒకవేళ వైసిపిలో చేరదలుచుకున్న ఎంఎల్ఏలు గనుక తమ పదవులకు రాజీనామాలు చేస్తే అభ్యంతరం లేదన్నట్లు జగన్ ఆమధ్య చెప్పిన విషయం తెలిసిందే. త్వరలో జరుగనున్న రాజ్యసభ ఎన్నిలను దృష్టిలో పెట్టుకునే వైసిపి ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. ఏదేమైనా జగన్ నిర్ణయం ఫిరాయింపులకు ఒక విధంగా నెత్తిన పాలు పోసేదే అని చెప్పవచ్చు. కాకపోతే వచ్చే ఎన్నకల్లో వారికి టిక్కెట్లు ఇస్తారా లేదా అన్నది మాత్రం సస్పెన్స్.
ఒకసారంటూ ఫిరాయింపులు టిడిపికి రాజీనామాలు చేయటం మొదలుపెడితే చంద్రబాబునాయుడుకు పెద్ద షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే, వైసిపి నుండి టిడిపిలోకి వచ్చినపుడు జగన్ పై వారిచేత చంద్రబాబు నానా ఆరోపణలు చేయించారు. ఇపడవే ఆరోపణలు చంద్రబాబుకే రివర్స్ అయ్యే అవకాశాలున్నాయి. ఫిరాయించిన 23 మంది ఎంఎల్ఏల్లో సుమారు 17 మంది టిడిపిలో ఇమడలేకున్నట్లు సమాచారం. వారిలో ఎంతమంది వైసిపిలోకి రావాలనుకుంటున్నారో స్పష్టత లేదు.