టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత, ఎంపీ కేశినేని నాని. ఎల్లో మీడియాలో వార్తలు చదివి జగన్‌పై తనకు అనుమానాలు ఉండేవని.. వాస్తవాలు తెలుసుకుంటే జగన్ గొప్పతనం తెలిసిందని కేశినేని పేర్కొన్నారు. 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత, ఎంపీ కేశినేని నాని. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పేదల కోసం జగన్ పని చేస్తారని, ధనికుల కోసం చంద్రబాబు పని చేస్తారని ఎద్దేవా చేశారు. సమాజం కోసం జగన్ పని చేస్తే పనికిరాని కొడుకుని ముఖ్యమంత్రి చేయటం కోసం పని చేసే వ్యక్తి చంద్రబాబు అంటూ నాని దుయ్యబట్టారు. ఎల్లో మీడియాలో వార్తలు చదివి జగన్‌పై తనకు అనుమానాలు ఉండేవని.. వాస్తవాలు తెలుసుకుంటే జగన్ గొప్పతనం తెలిసిందని కేశినేని పేర్కొన్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

రూ. 2.50 లక్షల కోట్లు పేద ప్రజలు కోసం జగన్ ఉపయోగించారని.. ప్రపంచంలోనే ఇంత పెద్ద కార్యక్రమాలూ ఎవరు చేయలేదని నాని కొనియాడారు. ఈ మాటలు తన గుండెల్లో నుంచి వచ్చాయని.. జీతాలు లేవు రావు అని వార్తలు చదివి నిజమే అనుకునే వాడినని కానీ ఏ పథకం ఇప్పటి వరకు ఆగలేదని కేశినేని తెలిపారు. రోడ్లు బాగోలేదు అంటారు ఆ రోడ్లు ఎక్కడ ఉన్నాయో కనపడవని.. ప్రభుత్వంపై నెగిటివ్ ప్రచారానికి మూల కారణం చంద్రబాబేనని కేశినేని నాని ఆరోపించారు. 

ఎన్నో దేశాలు తిరిగాను కానీ జగన్ లాంటి నాయకుడిని చూడలేదని.. ఆయన కమిట్మెంట్ ఉన్న నాయకుడన్నారు. రుణమాఫీ చేస్తానని చంద్రబాబు చెప్పాడు చేయలేకపోయాడని.. అమరావతి లేదు, అంబేద్కర్ విగ్రహం కడతాను అన్నాడు అదీ లేదని నాని ఎద్దేవా చేశారు. బోగస్ మాటలు చెప్పే వ్యక్తి చంద్రబాబని.. అంబేద్కర్ స్మృతివనాన్ని పర్యాటక కేంద్రంగా జగన్ మార్చారని కొనియాడారు. విద్యార్థులు బాగా చదువుకోవాలన్నది జగన్ కోరిక అని.. ఆరోగ్యానికి జగన్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రశంసించారు. 

ఎమ్మెల్యే కాకపోయినా నియోజకవర్గాన్ని దేవినేని అవినాష్ అభివృద్ది చేసి చూపించాడని కొనియాడారు. నెహ్రూ ఆశయ సాధనకు అవినాష్ కృషి చేస్తున్నారని.. రిటైనింగ్ వాల్ పూర్తి చేసిన ఘనత అవినాష్ సొంతమన్నారు. గతంలో కట్ట మీద ప్రజలు చాలా ఇబ్బంది పడేవారని నాని గుర్తుచేసుకున్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందంటే అవినాష్ పడిన కష్టమే కారణమన్నారు. అవినాష్ వచ్చే ఎన్నికల్లో 25 వేల మెజారిటీతో గెలుస్తాడని నాని జోస్యం చెప్పారు. 

టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌కి తాను లేకపోతే సీటు కూడా వచ్చేది కాదని.. చంద్రబాబు తనను చూసే గద్దె కి సీటు కేటాయించారని కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల తరువాత చంద్రబాబు రాష్ట్రం నుంచి పారిపోతాడని ఆయన వ్యాఖ్యానించారు.