దుర్గగుడి వివాదం... పాలకమండలి సభ్యురాలి చర్య సరైనదే: ఆలయ ఛైర్మన్
నైతిక బాధ్యత వహిస్తూ వరలక్ష్మి తన సభ్యత్వానికి రాజీనామా చేస్తూ లేఖ పంపిందని... దాన్ని ఆమోదించినట్లు విజయవాడ దుర్గ గుడి ఆలయ ఛైర్మన్ తెలిపారు.
విజయవాడ: తమ పాలక మండలి సభ్యురాలు కారులో మద్యం బాటిళ్ళు ఉన్నాయని పోలీసులు నిర్ధారించారని విజయవాడ దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు వెల్లడించారు. దీంతో నైతిక బాధ్యత వహిస్తూ వరలక్ష్మి తన సభ్యత్వానికి రాజీనామా చేస్తూ లేఖ పంపిందని... దాన్ని ఆమోదించినట్లు ఆలయ ఛైర్మన్ తెలిపారు.
''పదవుల్లో ఉన్నప్పుడు వ్యక్తిగతంగా అరోపణలు రావొచ్చు. కోర్టులో కేసు రుజువయ్యేవరకు రాజీనామా ను ఆమోదించాలని కోరారు. అమె తీసుకున్న నిర్ణయం సక్రమమైంది. చట్టం తన పనితాను చేసుకొని పోతుంది. జగన్ ప్రభుత్వ హయాంలో అవినీతికి, ఇటువంటి వాటికి తావులేదు. మా పాలకమండలి సభ్యురాలికి వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధం లేదని చెప్తున్నారు. పోలీసుల విచారణలో పూర్తి విషయాలు తెలుస్తాయి'' అన్నారు సోమినాయుడు.
read more దుర్గగుడి సభ్యురాలి వ్యవహారంపై... జగన్ సమాధానమేంటి?: నిలదీసిన కళా వెంకట్రావు
విజయవాడ కనకదుర్గ ఆలయ ట్రస్టు బోర్డు పదవికి నాగవరలక్ష్మి గురువారం నాడు రాజీనామా చేశారు. నాగవరలక్ష్మి కి చెందిన కారులో పోలీసులు బుధవారం నాడు అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకొన్నారు.తెలంగాణ రాష్ట్రం నుండి ఏపీకి అక్రమంగా మద్యాన్ని తరలిస్తుండగా పోలీసులు ఈ కారు నుండి మద్యాన్ని సీజ్ చేశారు.
తన కారులో అక్రమ మద్యం కేసు విషయమై విచారణ పూర్తయ్యే వరకు పదవి నుండి తప్పుకొంటున్నట్టుగా ట్రస్ట్ ఛైర్మెన్ కు ఆమె లేఖ రాశారు. ఈ లేఖతో పాటు రాజీనామా పత్రాన్ని ఛైర్మెన్ కు ఆమె పంపారు.
కారులో మద్యంతో తమకు సంబంధం లేదని నాగవరలక్ష్మి ప్రకటించారు. కారులో పెట్రోల్ పుల్ ట్యాంక్ చేయించుకొని రావాలని తన భర్త డ్రైవర్ కు చెప్పాడని కారులోకి మద్యం సీసాలు ఎలా వచ్చాయో తెలియదని ఆమె మీడియాకు తెలిపారు.ఈ కేసులో నాగవరలక్ష్మి కొడుకు సూర్యప్రకాష్ గుప్తాతో పాటు డ్రైవర్ అరెస్టయ్యారు.
నాగవరలక్ష్మి కారులో అక్రమంగా మద్యం తరలించిన విషయమై జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సీరియస్ అయ్యారు. నాగవరలక్ష్మితో ట్రస్టు బోర్డు సభ్యురాలి పదవికి రాజీనామా చేయాలని ఆదేశించారు. దీంతో గురువారం నాడు ఆమె తన పదవికి రాజీనామా చేసింది.
ఏపీ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మద్యం ధరలు ఎక్కువ. దీంతో ఇతర రాష్ట్రాల నుండి అక్రమంగా మద్యాన్ని తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. ఏపీ రాష్ట్రానికి సరిహద్దులో ఉన్న గ్రామాల్లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో పెద్ద ఎత్తున మద్యం సీసాలు బయటపెడుతున్నాయి. బుధవారం నాడు సాధారణ తనిఖీల్లో భాగంగా నాగవరలక్ష్మి కారులో తనిఖీలు చేయగా మద్యం సీసాలు లభ్యం కావడం ఏపీలో కలకలం రేపింది.