సాధికారిత మిత్రలతో చంద్రబాబు సమావేశం


అమరావతి: ప్రపంచంలోని ఆనందంగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ ఒకటని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. సాధికారిత మిత్రలకు త్వరలోనే స్మార్ట్‌ఫోన్లను అందించనున్నట్టు ఆయన ప్రకటించారు. స్మార్ట్‌ఫోన్లకు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించనున్నట్టు ఆయన ప్రకటించారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

సాధికారిత మిత్రలతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బుధవారం నాడు అమరావతిలోని ప్రజా దర్భార్‌ హల్ లో సమావేశాన్ని నిర్వహించారు. ప్రతి సాధికారిత మిత్రలు తమకు కేటాయించిన 35 కుటుంబాల బాగోగులను చూసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. నీతివంతమైన పాలనకు అండగా ఉండాలని ఆయన చెప్పారు. రానున్న రోజుల్లో ఏపీ రాష్ట్రం హ్యాపినెస్ ఇండెక్స్ లో టాప్ టెన్ లో ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

సాధికారిత మిత్రలు తమకు కేటాయించిన 35 ఇళ్ళలో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అందాయా లేదా ఇతరత్రా అంశాలను చెక్ చేసి ప్రభుత్వానికి సమాచారం చేరవేయాలన్నారు. 

టెక్నాలజీతో అవినీతిని రూపుమాపేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు రేషన్ షాపుల్లో నామమాత్రపు ధరకే మహిళలకు శానిటరీ నాప్‌కిన్స్‌ను విక్రయించనున్నట్టు ఆయన చెప్పారు. దీనికి రక్ష అనే పేరును ఈ సమావేశంలో చంద్రబాబునాయుడు ప్రకటించారు.

అనంతరం రాష్ట్ర ఐటీ, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి లోకేష్ ప్రసంగించారు. ప్రతి సాధికారిత మిత్ర తమకు కేటాయించిన కుటుంబాలకు సంబంధించిన 10 అంశాలను విజయవంతమయ్యేలా చూడాలన్నారు. ప్రతి గ్రామం ఈ 10 అంశాల్లో సక్సెస్ అయితే రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని ఆయన చెప్పారు.