బలవంతంగా బయటకు గెంటేందుకు ప్రయత్నం

టీడీపీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఇంటిపై దాడి జరిగింది. బలవంతంగా ఆయన కుటుంబసభ్యులను ఇంటి నుంచి గెంటే ప్రయత్నం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఇంటిపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే ఇంట్లో లేని సమయాన్ని అదునుగా చూసుకొని ఆయన కుటుంబ సభ్యులను ఇంటి నుంచి గెంటించే ప్రయత్నం చేశారు ఆ ఇంటి యజమాని. రామకృష్ణ.. ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నారు. అయితే.. అర్జంట్ గా ఇంటిని ఖాళీ చేయాలంటూ ఇంటి యజమాని బలవంతం చేశాడు. ఇంట్లో కూతురు పెళ్లి పెట్టుకున్నామని రెండు నెలలు గడువు ఇవ్వాల్సిందిగా వేడుకున్నప్పటికీ వినకుండా దాడి చేశారు.

దీనిపై శనివారం ఎమ్మెల్యే మీడియా సమావేశంలో మాట్లాడారు. రెండేళ్ల క్రితం ఆ ఇంటిని అద్దెకు తీసుకున్నానన్నారు. చిన్న చిన్న మరమ్మత్తులు సైతం తానే చేయించానని చెప్పారు. ఇటీవల యజమాని మాదాల తిరుపతయ్య ఇంటిని కార్పొరేటర్‌ దొడ్డపనేని రాజానాయుడికి విక్రయించారని, ఆ విషయాన్ని తనకు తెలియజేశారన్నారు. తనను ఇల్లు ఖాళీ చేయాలని రాజా నాయుడు కోరగా, ఆగస్టులో కుమార్తె వివాహం ఉండడంతో అప్పటి వరకు గడువు ఇచ్చేలా మధ్యవర్తుల సమక్షంలో ఒప్పందం కుదిరిందని చెప్పారు.

ఇంతలోనే ఇల్లు ఖాళీ చేయాలంటూ తాను లేని సమయంలో రాజానాయుడు, అతని బంధువులు వీధి రౌడీల్లా వ్యవహరిస్తూ ఇంటిలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారన్నారు. తాను మరొకరి సొత్తు ఆశించేవాడిని కాదని, కుమార్తె వివాహం అయిన వెంటనే ఖాళీ చేస్తానని హామీ ఇచ్చినా వినకుండా దౌర్జన్యం, తన మేనేజర్‌పై దాడి చేశారన్నారు. ఎమ్మెల్యే ఇంటిపై కార్పొరేటర్‌ దాడి చేస్తున్నా పోలీసులు కేసు నమోదులో జాప్యం చేశారని ఆరోపించారు. ఎస్పీని స్వయంగా కలిసి కేసు పూర్వాపరాలు వివరిస్తానని, తనవైపు తప్పుంటే చట్టపరంగా శిక్షించాలని కోరుతున్నానన్నారు. ఈ సమావేశంలో మధ్యవర్తులు వెంకటేశ్వర్లు, రమణయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు.