అలా చేయమన్నాం... లేదంటే మరో డ్రామాకు తెరతీసినట్లే..: ఎస్ఈసీతో భేటీ తర్వాత వర్ల వ్యాఖ్యలు
ఎంపిటీసి, జడ్పిటిసి నామినేషన్లు, ఎన్నికల ప్రక్రియలో అధికార పార్టీ ఎలా అక్రమాలకు పాల్పడిందో నూతన సీఎస్ కు వివరించినట్లు టిడిపి నాయకులు వర్ల రామయ్య తెలిపారు.
అమరావతి: నూతన ఎస్ఈసీ నీలం సాహ్నితో టిడిపి నేషనల్ జనరల్ సెక్రటరీ, పొలిట్ బ్యూరో సభ్యులు నేత వర్ల రామయ్య భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎంపిటీసి, జడ్పిటిసి నామినేషన్లు, ఎన్నికల ప్రక్రియలో అధికార పార్టీ ఎలా అక్రమాలకు పాల్పడిందో నూతన ఎస్ఈసికి వివరించినట్లు వర్ల తెలిపారు. ఇందుకు సంబంధించి ఎస్ఈసీ నీలం సాహ్నికి ఒక విజ్ఞాపన పత్రం అందించామని తెలిపారు.
సీఈసితో భేటీ అనంతరం వర్ల మాట్లాడుతూ... ఎంపిటీసి, జెడ్పిటిసి ఎన్నికలకు ప్రెష్ నోటిఫికేషన్ జారీచేయాలని ఎన్నికల సంఘాన్ని కోరామన్నారు. 2020 మార్చి లో నిర్వహించిన ఎన్నికల ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా ఎంపిటీసి లలో 24 శాతం, జెడ్.పి.టి.సి లలో 19 శాతం బలవంతపు ఏకగ్రీవాలు చేసుకుని అధికార వైసీపీ ఎన్నికల అక్రమాలకు పాల్పడిందని లేఖలో ప్రస్తావించామన్నారు. ఇదే విషయాన్ని గత ఎన్నికల కమీషనర్, కేంద్ర హోం సెక్రటరీకి సైతం లేఖ రాశామన్నారు వర్ల.
కొంత మంది పోలీసులతో అధికార పార్టీ కుమ్మక్కై బలవంతపు ఏకగ్రీవాలు చేసుకున్నారని... పోటీదారుల చేత బలవంతంగా నామినేషన్లను ఉపసంహరింపజేశారని ఆరోపించారు. వైసీపీ బెదిరింపులు, దాడులు, దౌర్జన్యాలకు పాల్పడిందన్నారు. నిజమైన ప్రజాస్వామ్యమంటే ఎన్నికల్లో పోటీచేసే ప్రతీ పోటీదారుడికి, అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు కల్పించాలన్నారు. కానీ గత మార్చిలో జరిగిన ఎన్నికల ప్రక్రియలో వైసీపీ దౌర్జన్యాలతో ప్రజాస్వామ్యం అపహాస్యం చేయబడిందన్నా వర్ల రామయ్య.
ప్రజాస్వామ్యంపై ప్రజల నమ్మకాన్ని కాపాడాలంటే ఎం.పీ.టి.సీ జెడ్.పి.టీ.సీ లకు కొత్తగా నోటిఫికేషన్ జారీచేయాలని ఎస్ఈసీకి వర్ల సూచించారు. అలాగే స్వేచ్చాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని కోరారు. కోర్ట్ ఆదేశాలు ఏకగ్రీవాల్లో జోక్యం చేసుకోలేము అని మాత్రమే ఉందని... తమరు వాటిని రివ్యూ చేయొచ్చన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. ప్రెష్ నోటిఫికేషన్ ఇవ్వకుండా తమరు ఎన్నికలు నిర్వహిస్తే అది మరో డ్రామాగా మారినట్టే అని వర్ల అన్నారు.